జిల్లాలో గణాంకాలు ఇవీ..
● దశాబ్దం తర్వాత రేషన్ దుకాణాల్లో కిరోసిన్ పంపిణీ
● అంతర్జాతీయ సంక్షోభంతో ఎల్పీజీ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం
● అదనంగా 48,000 కిలోలీటర్ల కేటాయింపు.. దశాబ్ద కాలంలోఇదే రికార్డు
● రేపటి నుంచే పల్లెలు, గిరిజనప్రాంతాల్లో పంపిణీకి శ్రీకారం
రాజంపేట: కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న కిరోసిన్ మళ్లీ వంటింట్లోకి అడుగుపెడుతోంది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా కిరోసిన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అంతర్జాతీయంగా నెలకొ న్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, గ్యాస్ సిలిండర్ల కొరత వెరసి సామాన్యుడిని మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి. రేపటి నుంచే జిల్లాలోని పల్లెల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
హర్ముజ్ సెగ.. వంటింట్లో మంట!
పశ్చిమాసియా యుద్ధం ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరగడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాధారణ కోటా 1,00, 000 కిలోలీటర్లకు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను కేటాయించింది. ఒక దశాబ్ద కాలంలో ఇంధన కోటాలో ఇంత పెద్ద పెంపు ఇదే తొలిసారి.
నేడు మనం వాడుతున్న కిరోసిన్ను కెనడియన్ వైద్యుడు, భూవిజ్ఞాన శాస్త్రవేత్త అబ్రహం గెన్నర్ 19వ శతాబ్దంలో కనుగొన్నారు. దీని రంగును బట్టి మన దగ్గర ’కృష్ణ ఆయిల్’ అని పిలుస్తారు. 2013–14 నుండి 2022–23 మధ్య కాలంలో దేశంలో కిరోసిన్ వినియోగం ఏటా 26 శాతం మేర తగ్గిపోయింది. అయితే ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మళ్లీ కిరోసిన్ను వంటగదికి చేరువ చేశాయి.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ – కిరోసిన్ తప్పదు
‘కిరోసిన్ చూసి దశాబ్దం దాటిపోయింది. 2015 నుంచి దశలవారీగా పంపిణీ కనుమరుగైంది. ఇప్పుడు అమెరికా–ఇరాన్ యుద్ధ ప్రభావంతో ప్రభుత్వం మళ్లీ పంపిణీకి సిద్ధమైంది. ’ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అన్నట్లుగా పాత విధానాలకే మళ్లీ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కిరోసిన్ పంపిణీ ఒక ఉదాహరణ.‘
– గునకల సుబ్బరాయుడు, సీనియర్ రేషన్ డీలరు, రాజంపేట
మధ్యాహ్న భోజన పథకానికి ఆసరానివ్వాలి
‘వంట ఏజెన్సీలకు ఇప్పుడు కిరోసిన్ దికై ్కంది. మధ్యాహ్న భోజన పథకానికి ఎల్పీజీ, కట్టెలు సరిపోవడం లేదు. గ్యాస్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం వెంటనే కిరోసిన్ సరఫరా చేయాలి. గతంలో లాగే కిరోసిన్ పొయ్యిలను కూడా పంపిణీ చేయాలి. రోజుకు కనీసం 4 లీటర్ల కిరోసిన్ అవసరం ఉంటుంది.‘
– పాలెం సాంబశివయ్య గౌడ్, అధ్యక్షుడు, ఏఐటీయూసీ, నందలూరు.
జిల్లా పరిధిలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే కిరోసిన్ అవసరం ఎంత ఉందో
అర్థమవుతుంది:
మొత్తం జనాభా: 22.60 లక్షలు
రేషన్ కార్డులు: 5.80 లక్షలు
గ్రామీణ జనాభా: 14.56 లక్షలు
సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు, తొలుత ఏజెన్సీ మరియు గ్రామీణ ప్రాంతాల్లో లీటరు చొప్పున పంపిణీ ప్రారంభం కానుంది. గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు, చిన్న హోటళ్లు, టీ కొట్టుల యజమానులు మళ్లీ కిరోసిన్ స్టవ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.


