● రైసింగ్ సన్ మల్టీ ఫీల్డ్ డెవలపర్స్ అండ్ ఇన్ఫ్రా వెంచర్ నిర్వాకం
● ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు వసూలు
● తర్వాత పత్తా లేకుండా పోయిన వైనం
కడప కార్పొరేషన్ : ఓ స్థలాన్ని చూపించి అక్కడ డెవలప్మెంట్ పేరుతో అగ్రిమెంట్లు రాసుకొని, ఆ ప్లాట్లనే విక్రయించి కోట్ల రూపాయలు దోచుకున్నారని బాధితులు వాపోతున్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా తమకు ప్లాట్లు రిజిస్టర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కేశవరెడ్డి స్కూల్ దగ్గర నివాసం ఉంటున్న కట్టుబడి హుస్సేన్ వల్లి భార్య షేక్ సాహెరా, మరి కొంత మంది బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీలో ఉషోదయ స్కూల్ దగ్గర మొదటి ఫ్లోర్లో డోర్ నంబర్–7/4267లో రైసింగ్ సన్ మల్టీ ఫీల్డ్ డెవలపర్స్ అండ్ వెంచర్స్ పేరుతో పుటిక సుబ్బరామయ్య కుమారుడు పుటిక సుబ్బరాయుడు కార్యాలయం ప్రారంభించారు. 2022లో ముద్దనూరు మండలం కల్లమల్ల పంచాయతీ కల్లమల్ల గ్రామ పొలంలో శ్రీ శివ సాయి వెంచర్స్ ఏర్పాటు చేసి ఐదు సెంట్లు కలిగిన ఒక్కో ప్లాటుకు మొదటి విడతగా రూ.5 లక్షల చొప్పున వసూలు చేశారు. ఆ తర్వాత పుటిక సుబ్బరాయుడు కనిపించకుండా పోయాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అతని కోసం బాధితులు నాలుగేళ్లుగా తిరుగుతూనే ఉన్నారు. వైఎమ్ఆర్ కాలనీలోని కార్యాలయం పెట్టిన ఇంటి వద్దకు వెళ్తే తమకు సంబంధం లేదని అక్కడున్న వారు చెబుతున్నారు. అక్కడ కార్యాలయాన్ని తొలగించేశారు. ఆ ఇంటి ఓనర్కు కూడా డబ్బులు ఇవ్వాలని చెబుతున్నారు.
రైల్వేకోడూరు జనసేన నాయకులతో
పుటిక సుబ్బరాయుడు
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన నాయకులతో పుటిక సుబ్బరాయుడు సన్నిహితంగా ఉన్న ఫొటోలు అతని ఫేస్బుక్లో కనిపిస్తున్నాయి. వారితో ఫొటోలతో పాటు ప్రెస్మీట్లో పాల్గొన్న ఫొటోలు కూడా ఉండటంతో అతనికి జనసేన నేతల మద్దతు ఉందని బాధితులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు వారు ఇటీవల కర్నూలు జిల్లా ఎస్పీని ఆశ్రయించగా ఆయన ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్స్టేషన్కు రెఫర్ చేసినట్లు తెలుస్తోంది. పుటిక సుబ్బరాయుడు ఎంత మంది వద్ద ఎన్ని లక్షలు వసూలు చేశాడు.. ఆయన బాధితులు ఎంత మంది ఉన్నారు అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.


