ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి ఏప్రిల్ 5 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, ఉదయం 8 నుంచి 11:30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుపుతారన్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని నీటితో శుద్ధి చేస్తారు.శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయమంతా ప్రోక్షణ చేసిన అనంతరం భక్తులకు స్వామి దర్శనానికి అనుమతిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు.
ప్రొద్దుటూరు: స్థానిక వైఎంఆర్ కాలనీకి చెందిన మురుకూటి జయప్రతాప్రెడ్డి, ప్రభావతి దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదివారం రూ.10,00,116 డీడీని అందించారు. తన కుమారుడు మురుకూటి వెంకట్ విజయ్ కుమార్రెడ్డి పేరున ఈ విరాళాన్ని ఇచ్చినట్లు ఈ సందర్భంగా జయప్రతాప్రెడ్డి దంపతులు తెలిపారు. తిరుమలలోని డోనర్స్ కౌంటర్లో సంబంధిత టీటీడీ అధికారి ప్రకాష్ చేతికి డీడీని అందించారు.
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని మేకలబాలయ్యపల్లె గ్రామంలో వెలసిన శ్రీ దుర్గమ్మ అమ్మవారిని భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి శ్రీచరణి దర్శించుకున్నారు. అదివారం మేకలబాలయపల్లి పరిధిలోని శ్రీదుర్గమ్మ అమ్మవారికి గ్రామస్తులు బోనాలను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే శ్రీచరణి కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ నిర్వహకులు జి. వెంకటేశు తెలిపారు.
జమ్మలమడుగు: మండల పరిధిలోనిఉప్పలపాడు గ్రామానికి చెందిన తలారి మోహన్ అనే విద్యార్థి గేట్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 89వ ర్యాంకును సాధించాడు. గత ఫిబ్రవరి 19న గేట్పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 19న వెలువడిని ఫలితాల్లో మోహన్ 89వర్యాంకు సాధించినట్లు తల్లిదండ్రులు లక్ష్మీదేవి, సంజీవరాయులు తెలిపారు. ప్రస్తుతం కర్నూల్ పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ టెక్ ఫైనలియర్ చదువుతున్నట్లు చెప్పారు. కుమారుడు 89వ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించు కోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని డీఆర్వో కోరారు.
సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను ఈ సోమవారం సభాభవన్ లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు.


