కడప సెవెన్రోడ్స్: భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ప్రత్యేకత అని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా పేర్కొన్నారు. జిల్లాలో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జేసీ డాక్టర్ నిధి మీనా అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజంపేట సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు, బద్వేలు, పులివెందుల ఆర్డీఓలు చంద్రమోహన్, చిన్నయ్య, కడప మున్సిపల్ కమిషనర్ రాకేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మత సంప్రదాయాలను గౌరవిస్తూ శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో భక్తి భావంతో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలను నిర్వహించుకునేలా జిల్లా శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని తెలిపారు. శాంతియుత, ఆనంద వాతావరణంలో, ఒకరి మతాచారాలను మరొకరు గౌరవించుకుంటూ భక్తి శ్రద్ధలతో రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించుకుకోవాలని.. శాంతి కమిటీ సంఘం సభ్యులకు సూచించారు. అందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి పండుగ, ఉత్సవాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాల ప్రజల సహకారంతో మజీద్లు, ఈద్గాలు, దేవాలయాల వద్ద ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రార్థనలు, పూజలు జరిగేలా చూడాలన్నారు. పండుగ, వేడుకల సమయంలో ఆలయాలు, మజీద్ల అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. అనవసరమైన విషయాలను అత్యుత్సాహంతో.. సోషల్ మీడియాలలో పోస్టు చేయడం వంటి చర్యలను అరికట్టేలా శాంతి కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో పోలీసు శాఖ అప్రమత్తంగా వుండాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలను శాంతి కమిటీ సభ్యులు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పండుగ దినాల్లో నిరంతర నీటి సరఫరా, విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల ఏర్పాట్లపై.. పలువురు శాంతి కమిటీ సభ్యుల అభిప్రాయాలను జేసీ స్వీకరించారు.
జిల్లా శాంతి కమిటీ సమావేశంలో
జేసీ నిధి మీనా


