ఐదో రోజుకు చేరిన కార్మికుల ఆమరణ దీక్ష
● సంఘీభావం తెలిపిన
ఏఐటీయూసీ నాయకులు
● ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమం
● రిమ్స్ ఆసుపత్రికి తరలింపు
కడప కార్పొరేషన్ : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ఈ దీక్షలకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు జి.వేణుగోపాల్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మిదేవి, బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోషియేషన్ అధ్యక్షులు కళ్యా సుధాకర్ తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదనపు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, చనిపోయిన కార్మికులు, 60 ఏళ్లు దాటిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. ఈ డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నా కార్పొరేషన్ అఽధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ క్రమంలో దీక్ష చేస్తున్న కార్మికులు రమాదేవి, మాధవి ఆరోగ్యం క్షీణించడంతో వారిని వైద్య పరీక్షల నిమిత్తం అంబులెన్స్లో రిమ్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, కార్మికులు అంబులెన్స్కు అడ్డుపడ్డారు. కార్మికుల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దీక్షలో మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్షుడు సుంకర రవితోపాటు నగర కమిటీ సభ్యులు, బాధితులు, మహిళలు ఉన్నారని, వారి ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పారు. అధికారులు చర్చలకి పిలిచి సమస్య పరిష్కారమయ్యే దశగా ఆలోచించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆరోగ్యం క్షీణించక ముందే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర కార్మిక నాయకులతో చర్చించారు. ఈ దీక్షలలో ఎస్.రవి, బి.నాగరాజ్, కె.రమేష్, మస్తాన్, నాగయ్య, మాధవి, సుజాత కూర్చొన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకు లు దస్తగిరమ్మ, ఇ.ప్రకాష్, వి.శ్రీధర్బాబు, సీపీ అరు ణ్, సువర్ణ, అమరావతి తదితరులు పాల్గొన్నారు.


