బాలిక అదృశ్యం
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని శ్రీరామమహల్ బైపాస్ రోడ్లోని భాగ్యనగర్ కాలనీలో నివాసముంటున్న శ్రీనివాసులు కుమార్తె కవిత మంగళవారం ఉదయం నుంచి కనిపించడం లేదని బాలిక చిన్నాన్న పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిమోతి తెలిపారు.
ఉద్యోగం రాలేదని
యువతి ఆత్మహత్య
జమ్మలమడుగు రూరల్ : ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన మేకల శీరిష (24) ఆత్మహత్య చేసుకున్న సంఘటన జమ్మలమడుగు పట్టణంలో చోటుచేసుకొంది. ఎస్ఐ హైమవతి కథనం మేరకు పట్టణంలోని స్టేట్బ్యాంక్ కాలనీకి చెందిన మేకల రామ్మోహన్ 2వ కుమార్తె శీరిష డిగ్రీ వరకు చదువుకొంది.తర్వాత సాఫ్ట్వేర్ కోర్స్లు చేసుకుంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేది. అయినా ఉద్యోగం రాకపోవడంతో బాధపడుతూ మంగళవారం రాత్రి కుటుంబసభ్యులు పడుకున్న తరువాత బాత్రూం కిటికీకి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం కుటుంబసభ్యులు పిలిచినా పలకకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా శిరీష ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దింపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం.గీత జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైందని హెచ్ఎం రవిచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్ర కాశం జిల్లా సింగరాయకొండలో గతనెలలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్–19 హ్యాండ్బాల్ పోటీల్లో గీత ప్రతిభ కనబరిచిందన్నారు. ఫిబ్ర వరి 1 నుంచి హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పూర్ జి ల్లాలో జరిగే పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు.
జిల్లా క్రీడాకారుల ప్రతిభ
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈనెల 27న నెల్లూరులో నిర్వహించిన పారా స్పోర్ట్స్ సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనపర్చినట్లు జిల్లా పారా స్పోర్ట్స్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పోటీల్లో 30 మంది క్రీడాకారులు పాల్గొనగా 15 మంది రజత, సిల్వర్ పతకాలు సాధించినట్లు తెలిపారు.
క్రెడిట్ యాక్టివేషన్ పేరుతో సైబర్నేరం
రూ.2,53,769 స్వాహా
ముద్దనూరు: మీ క్రెడిట్ కార్డు యాక్టివేషన్ చేయాలి, క్రెడిట్ కార్డుకు సంబంధించి వివరాలు చెప్పాలని వచ్చిన కాల్కు స్పందించగా బ్యాంకు ఖాతాలోని సొమ్ము కాజేశారు సైబర్నేరస్తులు. సీఐ నగేష్బాబు కథనం మేరకు మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన గంగవరం శ్రీవాణి చైన్నెలో పనిచేస్తున్నారు. ఈమె భర్తకూడా అక్కడే పనిచేస్తున్నారు.ఈనెల 9న శ్రీవాణికి 9477421272 అనే మొబైల్ నంబరునుంచి కాల్ వచ్చింది. మీ క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేయడానికి ప్రొటెక్షన్ ప్లాన్ అని చెప్పి వివరాలు సేకరిస్తుండగా యాప్నుంచి ఓటీపీ నమోదైంది.వెంటనే ఆమె ఫోన్ కట్చేసింది.కొద్దిసేపటికే ఆమె ఖాతా నుంచి మొదటిసారి రూ.28,650లు డ్రా అయినట్లు గుర్తించింది.అనంతరం ఆమె ఖాతాలో నుంచి మొత్తం రూ.2,53,769 ఆన్లైన్ ద్వారా సైబర్నేరగాళ్లు కాజేసినట్లు గుర్తించింది.పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుధవారం సైబర్ మోసం కింద కేసు నమోదుచేసినట్లు సీఐ తెలిపారు.


