నేటి నుంచి ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాలలో 2422 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సంబంధిత పరీక్షలు మూడు స్పెల్స్లో జరుగుతాయి. స్పెల్–1ని 27 నుంచి 31వ తేదీ వరకు 10 పరీక్షా కేంద్రాలలో, ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు స్పెల్–2ను 6 పరీక్షా కేంద్రాల్లో, అలాగే 6 నుంచి 10వ తేదీ వరకు స్పెల్–3ను 4 పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో సెషన్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4 , కేజీబీవీలో 1, ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 11 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు.
కడప సెవెన్రోడ్స్: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్థానిక జిల్లా కలెక్టర్ బంగ్లా ప్రాంగణంలో సోమవారం రాత్రి అట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ దేశ సమైక్యత సమగ్రత కోసం, అన్ని రంగాలలో జిల్లా అభివృద్ధికి ఐక్యంగా కృషి చేద్దామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వైఎస్ఆర్ కడప జిల్లాకు ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని కలెక్టర్ అధికారులను కోరారు. అనంతరం కలెక్టర్ వి ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి అధికారులను వారి కుటుంబ సభ్యులను పలకరించి పరిచయం చేసుకున్నారు.
● కడపకు ముద్ర డ్యాన్స్ అకాడమీ, ప్రొద్దుటూరుకు చెందిన నృత్య తరంగిణిబృందం చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆహ్లాదపరిచి ఆకట్టుకున్నాయి. అందులో భాగంగా.. పాల్గొన్న కళాకారులు అందరికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు మెమెంటో లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డి, కడప మేయర్ పాకా సురేష్కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


