సర్వాంగ సుందరం.. త్రివర్ణ శోభితం
● నేటి గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
● విద్యుత్ వెలుగులతో మెరిసిపోతున్న కూడళ్లు
● కలెక్టరేట్, పరేడ్ మైదానం ముస్తాబు
కడప సెవెన్రోడ్స్ : గణతంత్ర వేడుకలకు జిల్లా కేంద్రమైన కడప నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. త్రివర్ణ శోభితమై విద్యుత్ వెలుగులతో ప్రకాశిస్తోంది. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం జిల్లా పోలీసు మైదానంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం వేదికపై సీటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రవేశ ద్వారం నుంచి మైదానం వరకు భారీ జాతీయ పతాకాన్ని అలంకరించారు. వేదికకు ఇరువైపులా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్ సిద్ధం చేశారు. మైదానాన్ని రకరకాల రంగవల్లులతో తీర్చిదిద్దారు. అలాగే కలెక్టరేట్, డీపీఓలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. నగర మంతటా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో కొత్త శోభ నెలకొంది.
నేటి కార్యక్రమాలు
● పోలీసు పరేడ్ మైదానంలో ఉదయం 9 గంటలకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు.
● 9.05 గంటలకు కలెక్టర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి కవాతును పరిశీలిస్తారు. 9.15 గంటలకు మార్చ్ఫాస్ట్ ఉంటుంది.
● 9.25 గంటలకు జిల్లా ప్రజలనుద్దేశించి కలెక్టర్ సందేశం ఇస్తారు.
● 9.55 గంటలకు ప్రగతి శకటాల ప్రదర్శన, 10.15 గంటలకు స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం, 10.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11.05 గంటలకు ప్రశంసాపత్రాలు, పతకాలు, బహుమతుల ప్రదానం ఉంటంది. 11.40 గంటలకు స్టాల్స్ సందర్శన, లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ.
● 11.55 గంటలకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగుస్తుంది.
సర్వాంగ సుందరం.. త్రివర్ణ శోభితం


