
జీవిత ఖైదీకి గోల్డ్ మెడల్
కడప అర్బన్ : జీవిత ఖైదు అనుభవిస్తున్న గునుకుల యుగంధర్ డిగ్రీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి గోల్డ్ మెడల్ సాధించారు. కడప కేంద్ర కారాగారం అధికారులు, యుగంధర్ తల్లి చెంగమ్మ, చెల్లెలు మేఘన వివరాల మేరకు.. కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న యుగంధర్ ప్రస్తుత తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం జంగాలపల్లి నివాసి. 2011 జూలై, 18న హత్య కేసులో జీవిత ఖైదు విధించబడి కేంద్ర కారాగారానికి వచ్చాడు.
అప్పటినుంచి ఓల్డ్ పాటర్న్లో రెండు బీఏ డిగ్రీలు, న్యూ పాటర్న్లో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్(సీబిఎస్సి )లో రెండు బీఏ డిగ్రీలు, మూడు ఎంఏ డిగ్రీలు, కంప్యూటర్, కార్పెంటరీ, నాక్ స్కిల్స్లో సర్టిఫికెట్లు పొందాడు. ఇటీవల డిగ్రీలో 8.02 జీపీలోతో అత్యుత్తమ ప్రతిభ కనబరచి మంచి ర్యాంకు సాధించడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్, బుక్ ప్రైజ్ దక్కాయి. ఈ నెల 30న హైదరాబాద్లో మెడల్ అందుకోనున్నారు. ఇతడు పారా లీగల్ వలంటీర్గా పనిచేశారని అధికారులు తెలిపారు.
నా బిడ్డకు క్షమాభిక్ష పెట్టండి
హత్య కేసులో 20 ఏళ్లుగా జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న తన కుమారుడు యుగంధర్కు క్షమాభిక్ష పెట్టాలని అతడి తల్లి చెంగమ్మ, సోదరి మేఘన కోరారు. గోల్డ్ మెడల్ సాధించి సత్ప్రవర్తన కలిగి ఉన్నాడని.. ప్రభుత్వం గుర్తించి తన బిడ్డను విడుదల చేయాలని కోరారు.