
ఆర్భాటం.. హంగామా?
డీఎస్సీ నియామక పత్రాల
పంపిణీ: 19వ తేదీ
ఉమ్మడి కడప జిల్లాలో ఉద్యోగాలు
పొందిన అభ్యర్థులు: 628 మంది
కడప ఎడ్యుకేషన్: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి తెర లేపింది. 150 రోజుల పాటు కసరత్తు జరిపి నానా హంగామా చేశారు. తీరా అర్హులకు న్యాయం చేశారా అంటే అదీ లేదు. అనర్హులకు, అనుకూలమైనవారికి ఉద్యోగాలు కల్పించారని ప్రచారం జరుగుతోంది .ఇప్పుడు నియామకపత్రాల పంపిణీ పేరుతో మరో డ్రామా తెరమీదకు తెచ్చారు. ఈనెల 19న విజయవాడ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు పంపిణీ చేస్తామంటూ హంగామా సృష్టిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాల నుంచి విజయవాడకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పలువురు మండిపడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.
● ఉమ్మడి కడప జిల్లాల వ్యాప్తంగా నిర్వహించిన మెగా డీఎస్సీ కసరత్తు విమర్శలకు తావిస్తోంది.150 రోజుల పాటు సాగదీసి అర్హులకు మెండి చేయి చూపారని పలువురు మండిపడుతున్నారు. ఈనెల 15న మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రచురించారు. ఈ జాబితా ప్రచురించాక వందల సంఖ్యలో హెల్ప్డెస్క్కు కాల్స్ వస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగాలు రాని పలువురు జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు వెళ్లటం న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు.
● కూటమి ప్రభుత్వం డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ) పేరుతో తిలోదకాలిచ్చారని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం డీఎస్సీ కసరత్తు జిల్లా స్థాయిలోనే జరిగేది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలోనే నిర్వహించారు. ఈ కసరత్తులో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు వాపోతున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత మెరిట్, రోస్టర్ ప్రకారం విడుదల చేయాల్సిన జాబితా ఆఖర్లో గందరగోళం సృష్టించారు. ఎంపిక జాబితా పేరుతో పలు సార్లు ప్రచురించి, కాల్లెటర్లు పంపి, సర్టిఫికెట్లు పరిశీలించారు. తీరా తుది జాబితా ప్రచురించే సమయానికి ఎక్కువ ర్యాంకులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు, తక్కువ ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు అనర్హులుగా పేర్కొన్నారు.
● మెగా డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు అందజేసే నియామకపత్రాల పంపిణీ కసరత్తును కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచారంగా మలుచుకుంది. ఈ ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో విజయవాడలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంపికై న అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా రావాలని విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపారు. దాదాపు 400 కిలోమీటర్లు దూరం వెళ్లాలంటే ఎంతో వ్యయప్రయాసాలతో కూడుకున్న పని. ప్రభుత్వం నిర్ణయంతో పలువురు మండిపడుతున్నారు. వైఎస్సార్జిల్లా నుంచి 1600 మంది 40 బస్సుల్లో వెళ్లనున్నారు.
జిల్లాలోనే నియామకపత్రాలు అందచేయాలి
డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులకు జిల్లాస్థాయిలోనే నియమాకపత్రాలు అందచేయాలి. విజయవాడకు రమ్మని చెప్పడం సరికాదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా చేయడం అన్యాయం. అధికారులు పునరాలోచించాలి. – సజ్జల రమణారెడ్డి, వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
డీఎస్సీ ఆర్డర్లకు 500 కిలోమీటర్లు వెళ్లాలా!
మండిపడుతున్న అభ్యర్థులు