
ఆటో మిత్ర పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఆటోమిత్ర పథకం కింద ఆర్థిక సాయం కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి కోరారు. ఆటో రిక్షా/మోటార్ క్యాబ్ /మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ యజమానులకు 2025– 26వ సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం రూ.15000 సాయం అందించేందుకు మార్గ దర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. వాహన యజమాని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండాలని, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనమై ఫిట్నెస్ సర్టిఫికెట్, మోటార్ వాహన టాక్స్ కలిగి ఉండాలన్నారు. ప్యాసింజర్ ఆటో రిక్షా దారులు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నారు. ప్రతి దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు, తెల్లరేషన్కార్డు కలిగి ఉండడంతోపాటు ఒక కుటుంబానికి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుడి కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగులు కారాదని, ఆదాయ పన్ను చెల్లించేవారై ఉండరాదని, 300 యూనిట్ల కరెంటు వినియోగించేవారై ఉండరాదని అన్నారు. శానిటరీ పని చేసేవారికి మినహాయింపు ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తడి పొలం మూడు, డ్రైలాండ్ అయితే పదెకరాలు, మున్సిపాల్టీ ప్రాంతాల్లో 1000 స్క్వేర్ మీటర్ల స్థలం ఉండే అభ్యర్థులు ఈ పథకానికి అనర్హులన్నారు. అర్హులు ఉంటే ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీలోపు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 24న జాబితా ప్రకటిస్తారని, అర్హులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు అందిస్తారని వివరించారు.
డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–23 మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్ మూడో రోజున డ్రాగా ముగిసింది. అనంతపురం–కర్నూలు జట్ల మధ్య కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో శనివారం మూడో రోజున ఎనిమిది వికెట్ల నష్టానికి 114 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాంటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 148 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఎంకె.దత్తారెడ్డి 57 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని అక్షిత్రెడ్డి నాలుగు, సాబ్జాన్ మూడు, కనిష్ రెండు వికెట్లు తీశారు. అనంతరం కర్నూలు జట్టు రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించి 74 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని సాయి గణేష్ 22 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని దీపక్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 16.1 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ఆ జట్టులోని మహేంద్ర 40 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ అధిక్యంతో కర్నూలు జట్టు మూడు పాయింట్లు దక్కించుకుంది.
వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.....
వైఎస్సార్ స్టేడియంలో చిత్తూరు–నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. శనివారం మూడో రోజున రెండు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 40 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని నిఖిలేశ్వర్ 40, పవన్ రిత్విక్ 23 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని అచ్యుతానంద రెండు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 58 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఆ జట్టులోని రెడ్డి రుషిల్ 42, జివి,చరణ్జిత్ 67 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుజిత్రెడ్డి నాలుగు, మాధవ్ మూడు వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో అధిక్యం దక్కించుకుంది.