
కొండను తవ్వేస్తూ.. మట్టిని తరలిస్తూ
అధికారం మాదే.. అడ్డెవరన్నట్లు ఓ కాంట్రాక్టర్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోకుండా కొండను తవ్వేసి మట్టిని జాతీయ రహదారి నిర్మాణానికి తరలించేస్తున్నారు. ఇదంతా చూస్తున్న అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
జమ్మలమడుగు : కల్వకుర్తి–నంద్యాల జాతీయ రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం మీదుగా ముద్దనూరు రహదారిలో కొత్త రోడ్డు వరకు ఈ దారి విస్తరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం నంద్యాల–కోవెల కుంట్ల మీదుగా నొస్సం వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. పెద్దముడియం మండలం గుల్లకుంట మీదుగా ఉప్పలపాడు, జమ్మలమడుగు, పెన్నానది మీద నుంచి పాలిటెక్నిక్ కళాశాల వెనుక వైపునా కొత్త రోడ్డు విస్తరణ పనులను ఎస్ఆర్సీప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికార పార్టీ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. పెద్దముడియం మండలం నుంచి జమ్మలమడుగు కొత్త రోడ్డు వరకు 22 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం పనులు చేపట్టిన గుత్తేదారు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నా..అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
యథేచ్ఛగా మట్టి తరలింపు
రోడ్డు నిర్మాణానికి గుత్తేదారు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ముద్దనూరుకు వెళ్లే రహదారిలో కొండను పొక్లెయిన్ పెట్టి తవ్వేస్తున్నారు. టిప్పర్లు పెట్టి తరలిస్తున్నా.. ఆ వాహనాలన్నీ అధికారుల కళ్లెదుటే తిరిగినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అనుమతులు లేకుండా పనులు చేస్తున్న గుత్తేదారును అడ్డుకునేందుకు అధికారులు జంకుతున్న పరిస్థితి. తమదే అధికారం.. మాకు అడ్డు ఎవరు అంటూ కొండను పిండి చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.
ఎలాంటి అనుమతులు లేవు
జాతీయ రహదారి కోసం కొండ తవ్వుతున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. ఎంత మట్టి తవ్వారో మొత్తం క్యూబిక్ మీటర్ల మేర కొలిచి చలానా కట్టిస్తాం. అనుమతులు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్, జమ్మలమడుగు
పొక్లెయిన్తో తవ్వి టిప్పర్లతో మట్టి తరలింపు
అధికార పార్టీ గుత్తేదారు నిర్వాకం