
పిల్లలపై పోలీసు జులుం
● టీడీపీ జెండాలను తొలగించారని మైనర్లపై కేసు
● అరెస్ట్ చేసి.. రిమాండ్కు తరలింపు
● మా పిల్లలకు సంబంధం లేదంటున్న తల్లిదండ్రులు
● ఎవరో పీకిన వాటికి బాధ్యులను చేశారని ఆవేదన
● మా వారిని చూపించాలనిస్టేషన్ ఎదుట నిరసన
పులివెందుల రూరల్: పులివెందుల అర్బన్ పోలీస్స్టేషన్ ఎదుట శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం కదిరి రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలను తొలగించారని కనంపల్లెకు చెందిన బాలాజి నాయక్తోపాటు ముగ్గురు మైనర్లను గురువారం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. దీంతో ఇప్పటి వరకు ఆచూకీ లేకపోవడంతో మా పిల్లలను చూపించాలని వారి తల్లిదండ్రులు శుక్రవారం పులివెందుల పోలీస్స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. అరెస్టు చేసి 24 గంటలవుతున్నా పిల్లలను చూపించలేదని, కడప డీటీసీలో ఉంచారని, అలాగే ఇతర స్టేషన్ల చుట్టూ తిప్పుతూ కొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏవరో జెండాలు తొలగిస్తే.. తమ పిల్లలను బాధ్యులను చేయడం దారుణమని వాపోయారు. వారు ముగ్గురూ మైనర్లేనని, ఇంటి వద్ద ఆడుకుంటుండగా బాలాజి నాయక్ పిలిచుకుని వెళ్లారని తెలిపారు. బాలాజి నాయక్ ఒక్కడే జెండాలను పీకి కాల్చినట్లు ఒప్పుకున్నారని మైనర్ల తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు. దీంతో డీఎస్పీ మురళీ నాయక్, సీఐ చాంద్ బాషాలు.. స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలతో మాట్లాడారు. నిజంగా మీ పిల్లలు ఎటువంటి తప్పు చేయకపోతే ఇంటికి పంపించేస్తానని, తప్పు చేసి ఉంటే తప్పనిసరిగా జైలుకు వెళ్లాల్సి వస్తుందని తెలియజేశారు.
మైనర్ పిల్లలపై అక్రమ కేసు నమోదు
టీడీపీ నాయకులు క్రియేట్ చేసిన వీడియో ఆధారంగా గురువారం రాత్రి బాలాజి నాయక్తోపాటు ముగ్గురు మైనర్ పిల్లలపై పులివెందుల పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. టీడీపీ జెండాలు తొలగించారని సంజీవ్ అనే వ్యక్తి వీరిని అడ్డుకున్నట్లుగా.. అతనిపై పిల్లలు దాడి చేసినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ రాసుకుని కేసు నమోదు చేశారు. మైనర్ పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలి. అలా కాకుండా పులివెందుల పోలీసులు టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరిగింది.
పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన
గురువారం సాయంత్రం పోలీసులు మైనర్ పిల్లలను అరెస్టు చేయడంపై శుక్రవారం పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు, వారి బంధువులు పులివెందుల అర్బన్ పోలీస్స్టేషన్కు వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమకు ఏ పార్టీకి సంబంధం లేదని, తమ పిల్లలను గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని, పలు స్టేషన్లలో వారిని కొడుతున్నారని, మా పిల్లలను చూపించాలని ఆందోళన చేపట్టారు. కనీసం తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయారు. దీంతో డీఎస్పీ మురళీ నాయక్ వచ్చి మీ పిల్లలు తప్పు చేయకుంటే ఇంటికి వస్తారని, తప్పు చేస్తే జైలుకు వెళ్తారని తెలిపారు.
జువైనైల్ హోంకు..
గురువారం రాత్రి జరిగిన సంఘటనలో మైనర్ పిల్లలను కడప జువైనైల్ హోంకు రిమాండ్కు తరలించినట్లు తెలుస్తోంది. అలాగే బాలాజి నాయక్ను జమ్మలమడుగు కోర్టులో ప్రవేశపెట్టినట్లు సమాచారం.
వైఎస్సార్సీపీ నాయకులపై కూడా..
గురువారం సాయంత్రం జరిగిన సంఘటనలో టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు పలువురు వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నలుగురు పాల్గొన్నట్లు టీడీపీ నాయకులే మీడియా వారికి వీడియో విడుదల చేశారు. అయితే దీని ఆధారంగా చేసుకుని వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉన్న పలువురి నాయకులపై ఈ కేసులో పేర్లు నమోదు చేసినట్లు సమాచారం. దాదాపు 12 మందిపై ఈ కేసులో అక్రమంగా పేర్లు చేర్చినట్లు తెలుస్తోంది.
ఎటువంటి తప్పు చేయలేదు
ఇంటి వద్ద ఆడుకుంటున్న మా పిల్లవాడిని బాలాజి నాయక్ తీసుకొని వెళ్లాడు. మా కొడుకు జెండాలు పీకలేదు, మా వాడికి ఎటువంటి సంబంధం లేదు. అయినా పోలీసులు తీసుకెళ్లి ఎక్కడున్నాడో చూపించకుండా కొడుతున్నారు. ఇది చాలా దారుణం.మా పిల్లలను మాకు చూపించాలి. – రెహ్మాన్,
మైనర్ పిల్లవాడి తండ్రి, పులివెందుల
మాకు ఏ పార్టీతో సంబంధం లేదు
మేము పులివెందుల పట్టణంలో నివాసముంటున్నాం. ఏ పార్టీతో సంబంధం లేదు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. టీడీపీ జెండాలు పీకారని మా కుమారుడిని పోలీసులు అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో తెలియదు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. – మల్లేశ్వరి,
మైనర్ పిల్లవాడి తల్లి, పులివెందుల
మైనర్లనూ వదలని టీడీపీ నాయకులు
పులివెందులలో టీడీపీ నాయకులు కక్షపూరిత రాజకీయాలను కొనసాగిస్తున్నారు. రెండు వారాల క్రితమే కేవలం మహానాడు సందర్భంగా పులివెందుల రింగ్ రోడ్డు ప్రాంతాలలో వైఎస్సార్ విగ్రహాల చుట్టూ టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో టీడీపీ జెండాలు, తోరణాలు కట్టడం జరిగింది. దీనిపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు వాటిని తొలగించడం జరిగింది. కేవలం వాటిని తొలగించారనే కారణంతో టీడీపీ నాయకులు పోలీసుల ద్వారా వారిపై అటెంప్ట్ మర్డర్ కేసు, దొంగ అక్రమ కేసులో జైలులో ఉంచడం జరిగింది. అయితే గురువారం సాయంత్రం కనంపల్లెకు చెందిన బాలాజి నాయక్ అనే యువకుడు వైఎస్సార్ మీద అభిమానంతో కదిరి రింగ్ రోడ్డులో వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఉన్న టీడీపీ జెండాలను తొలగించారు. అయితే బాలాజి నాయక్ తనతోపాటు తన బంధువుల పిల్లలైన మైనర్ పిల్లలను వెంట తీసుకుపోయారు. ఇందులో బాలాజి నాయక్ టీడీపీ తోరణాలను తొలగించి పక్కన వేయడం జరిగింది. మైనర్ పిల్లలకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడే టీడీపీ నాయకులు నీచ రాజకీయాలకు తెర లేపారు. తోరణాలు కాల్చకున్నా కూడా కాల్చినట్లుగా అదే ప్రాంతంలో పక్కన ఉన్న కంపచెట్లలో మంటను రాజేసి తోరణాలను కాల్చినట్లుగా వీడియో క్రియేట్ చేశారు.
కోటింగ్
గురువారం సాయంత్రం జరిగిన విషయంలో నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు గురువారం అర్ధరాత్రి వారిని కడప డీటీసీకి తరలించినట్లు సమాచారం. అక్కడ పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు తెలిసింది. అయితే మైనర్ పిల్లలపై ఈ విధంగా పోలీసులు టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఎంత వరకు సమంజసమని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

పిల్లలపై పోలీసు జులుం

పిల్లలపై పోలీసు జులుం

పిల్లలపై పోలీసు జులుం

పిల్లలపై పోలీసు జులుం

పిల్లలపై పోలీసు జులుం