మా నాలుక మందమో.. మీ చర్మం మందమో ప్రజలే తేలుస్తారు | - | Sakshi
Sakshi News home page

మా నాలుక మందమో.. మీ చర్మం మందమో ప్రజలే తేలుస్తారు

Jun 14 2025 7:27 AM | Updated on Jun 14 2025 7:27 AM

మా నాలుక మందమో.. మీ చర్మం మందమో ప్రజలే తేలుస్తారు

మా నాలుక మందమో.. మీ చర్మం మందమో ప్రజలే తేలుస్తారు

తల్లికి వందనం పథకం చెప్పింది ఎంత మందికి.. ఇచ్చింది

ఎంత మందికి?

సూపర్‌ 6 పథకాలు అమలు చేశామని ఏవిధంగా చెబుతున్నారు

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరు : తమ ప్రభుత్వం సూపర్‌– 6 పథకాలను అన్ని అమలు చేసినట్లేనని.. ఎవరైనా విమర్శిస్తే వారి నాలుక మందమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. విమర్శించిన వారి నాలుక మందమో.. పథకాలు అమలు చేయకుండా ఎగ్గొట్టిన వారి చర్మం మందమో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ఆయన శుక్రవారం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికి 67,27,164 మందికి తల్లికి వందనం అమలు చేసినట్లు ప్రకటించిన చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ బాబు ఇస్తున్నది మాత్రం 54,94,500 మందికి మాత్రమే అన్నారు. ఇంకా 14 లక్షల మంది విద్యార్థులకు వారు చెప్పిన ప్రకారం వర్తింపజేయాల్సి ఉందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఒక్కో విద్యార్థికి జగనన్న అమ్మ ఒడి పథకాన్ని 44 లక్షల మందికి అమలు చేశారని, ఇద్దరు విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు ఇంకెంత మందికి వర్తింపజేయాల్సి ఉంటుందని ప్రశ్నించారు. 83 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేయాల్సి ఉందని గతంలో చంద్రబాబు, లోకేష్‌ జగన్‌ను విమర్శించారన్నారు. ఇది అమ్మ ఒడి కాదు అర్ధ ఒడి అని వారు విమర్శించారని, మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పావల ఒడినా అన్నారు. మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి అమ్మ ఒడి పథకంలో రూ.1000 కట్‌ చేస్తే నానా యాగి చేసిన చంద్రబాబు, లోకేష్‌ ఇప్పుడు రూ.2వేలు ఏవిధంగా కట్‌ చేశారని ప్రశ్నించారు. తల్లికి వందనం పథకం మొత్తంలో అనేక అవకతవకలు ఉన్నాయని తెలిపారు. ఉదాహరణకు మండలంలోని తాళ్లమాపురం గ్రామంలో జగనన్న ప్రభుత్వంలో 549 మందికి అమ్మ ఒడి పథకం వర్తిస్తుండగా ఇప్పుడు 509 మందికి మాత్రమే వచ్చిందన్నారు. 300 యూనిట్లు విద్యుత్‌ అని, రకరకాల కారణాలతో కోత విధించారన్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారన్నారు. కేవలం పల్లె వెలుగుల బస్సులనే ఈ పథకంలో ఏర్పాటు చేస్తారని, జిల్లాలను దాటకుండా హద్దులు విధించే అవకాశం ఉందన్నారు. ఉచిత సిలిండర్ల పథకం 100కి 30 మందికి మాత్రమే అమలవుతోందని రాచమల్లు స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6వేలుతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలు ఇస్తామని ప్రకటించారని, ఇప్పుడేమో రెండు కలిపి రూ.20వేలు ఇస్తామని చెప్పడం తగునా అని ప్రశ్నించారు.

ఆ రెండు పథకాల పరిస్థితి ఏమిటి ?

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆడబిడ్డ నిధి పథకం అని రాచమల్లు తెలిపారు. ఈ పథకాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేయకపోగా పీ4 విధానంలో అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మన దేశానికి సంబంధించి విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు ఇక్కడ ఉన్న పేదలను ధనవంతులుగా చేసేందుకు చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగిందన్నారు. ఇది సాధ్యమేనా అని రాచమల్లు ప్రశ్నించారు. పీ4 విధానం గురించి ప్రజలకు కనీస అవగాహన ఉందా అని తెలిపారు. నిరుద్యోగ భృతి పథకం పరిస్థితి కూడా అంతేనన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఈ రెండు పథకాలకు సంబంధించి పీ4 విధానంతోపాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా ఉపాధి కల్పిస్తామనే ధైర్యం ఉంటే ప్రజల వద్దకు వెళ్లి చెప్పాలని అన్నారు. గత ఏడాది కాలంలో తాము సంపద సృష్టించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, అలాంటప్పుడు గత ఏడాదిలో రూ.1.70 లక్షల కోట్ల అప్పులు ఎందుకు తేవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది కాలంలో 188 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత ఏడాదిలో సాధించిన అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, చిన్నారులను చిదిమేస్తున్నారని, హింస పెరిగిందని, జర్నిలిజంపై దాడి చేస్తున్నారని, వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నాయని విమర్శించారు. పథకాలను అమలు చేసేంత వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంగా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భీమునిపల్లి లక్ష్మీదేవి, కౌన్సిలర్లు రాగుల శాంతి, లావణ్య, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సత్యం, చింపిరి అనిల్‌ కుమార్‌, చౌడం రవిచంద్ర, వైఎస్సార్‌సీపీ నాయకుడు గౌతం రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement