
డీఎస్సీ పరీక్షకు 127 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డీఎస్సీ ఆన్లైన్ పరీక్షకు శుక్రవారం 127 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్లో 8 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 1510 మందికి గాను 1415 మంది హాజరు కాగా 95 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం విడతలో 1510 మందికి గాను 1478 మంది హాజరు కాగా 32 మంది గైర్హాజయ్యారు. మొత్తం 3020 మందికి గాను 2893 మంది హాజరు కాగా 127 మంది గైర్హాజరయ్యారు.
బాధ్యతల స్వీకరణ
కడప సెవెన్రోడ్స్: సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా సహాయ సంచాలకులు (ఏడీ)గా పద్మజ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు, అధికార కార్యక్రమాలను మీడియా ద్వారా మరింత విస్తృతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఏఈఐఈ శ్రీనివాస రావు, డివిజనల్ పీఆర్వో సునీల్ సాగర్, పీఆర్వో రవికుమార్, ఏవీఎస్ నాగయ్య, రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వరయ్య, సిబ్బంది ఏడీని కలిసి అభినందనలు తెలియజేశారు.
నేరాల నియంత్రణే లక్ష్యం
బద్వేలు అర్బన్ : నేరాల నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బద్వేలు అర్బన్, రూరల్ పోలీస్స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ బద్వేలు ప్రాంతంలో భూకబ్జాలు, నకిలీ పట్టాల సమస్యలు అధికంగా ఉన్న నేపథ్యంలో నకిలీ పట్టాలని తేలితే సంబంధిత వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అర్బన్ సీఐ రాజగోపాల్, ఎస్ఐలు ఎం.సత్యనారాయణ, కె.శ్రీకాంత్, కె.జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డీఎస్సీ పరీక్షకు 127 మంది గైర్హాజరు