
కొమ్మినేనికి బెయిల్ ప్రభుత్వానికి చెంపపెట్టు
కడప కార్పొరేషన్ : సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొమ్మినేనికి బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సంతోషదాయకమన్నారు. మూడేళ్లలోపు శిక్షపడే కేసులకు 41ఏ కింద నోటీసులు ఇచ్చి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అవేమీ పాటించకుండా డిబేట్లో ఓ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలను యాంకర్కు, ప్రసారం చేసిన ఛానెల్కు ఆపాదించడం దారుణమన్నారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం సాక్షి కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయించి, రౌడీ మూకలతో దాడులు చేయించిందన్నారు. పరిపాలనలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ప్రజల వాక్ స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ధ్వజమెత్తారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి
కేఎస్ఆర్పై కేసు కక్ష పూరిత చర్య
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఎలాంటి నోటీసులను ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. 30 ఏళ్ల అనుభవం వున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు టీవీ రంగంలో కూడా గత 15 ఏళ్ల నుంచి యాంకరింగ్ నిర్వహిస్తున్నారు. టీవీ డిబేట్లలో యాంకరింగ్ చేసే సీనియర్ పాత్రికేయులకు, డిబేట్లో పాల్గొనే విశ్లేషకుల అభిప్రాయాలకు సంబంధం లేకపోయినా.. కేఎస్ఆర్పై అక్రమ కేసు బనాయించడం వాక్ స్వాతంత్య్రానికి విఘాతం కలిగిస్తోంది. ఈ సంఘటన ప్రభుత్వ కక్షపూరితంగా వ్యవహరించిన చర్యగా భావించాల్సి వస్తోంది. పత్రికా, మీడియా కార్యాలయాలపైన దాడులను చేయించడం ఎంతవరకు సమంజసం. వ్యక్తుల, మీడియా స్వేచ్ఛను హరించే విధంగా ప్రవర్తిస్తే ప్రభుత్వ మనుగడకు ముప్పు వాటిల్లక తప్పదు.
– వీజీ రాఘవరెడ్డి, వైఎస్సార్ జిల్లా కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు

కొమ్మినేనికి బెయిల్ ప్రభుత్వానికి చెంపపెట్టు