కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డీఎస్సీ ఆన్లైన్ పరీక్షకు గురువారం 275 మంది గైర్హాజరయ్యారు. ఉదయం విడతలో 8 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 1410 మంది అభ్యర్థులకు గాను 1325 మంది హాజరు కాగా 85 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 1410 మందికి గాను 1220 మంది హాజరు కాగా 190 మంది గైర్హాజయ్యారు. మొత్తం 2820 మందికి గాను 2545 మంది హాజరు కాగా 275 మంది గైర్హాజరయ్యారు.
వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి
కడప అగ్రికల్చర్: జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ పేర్కొన్నారు. ఆయన గురువారం జిల్లా వ్యవసాయ అధికారిగా కడప కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఆయనకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.
డీసీఓ బాధ్యతల స్వీకరణ
కడప అగ్రికల్చర్: జిల్లా కో ఆపరేటివ్ అధికారి(డీసీఓ)గా వెంకటసుబ్బయ్య గురువారం కడప కలెక్టరేట్లోని కోఆపరేటివ్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈయన కర్నూలు జిల్లా డ్వామా పీడీగా, జెడ్పీ సీఈఓగా పని చేశారు. అలాగే నంద్యాల జిల్లాలో డీఆర్డీఏ పీడీగా పనిచేయడంతోపాటు డీసీఓగా పని చేస్తూ తాజాగా వైఎస్సార్ జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోఆపరేటివ్ రంగ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.
మెరుగైన విద్యే లక్ష్యం
కడప ఎడ్యుకేషన్: విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా పని చేస్తామని ఇంటర్మీడియెట్ విద్య వైఎస్సార్ కడప జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి(డీఐఈఓ) టీఎన్వీవీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన గురువారం తన చాంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోని మురుమండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పని చూస్తూ పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జి.రామక్రిష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీ రవీంద్రారెడ్డి, ట్రెజరర్ రమణయ్య, స్టేట్ కౌన్సిలర్ పద్మావతి, అధ్యాపకులు నాగమహేశ్వరరెడ్డి, హబీబుల్లా సన్మానించారు.