
పాఠశాలను విలీనం చేస్తే ఒప్పుకోం!
చాపాడు: తమ ఊరిలోని పాఠశాలను వేరే గ్రామంలోకి విలీనం చేస్తే ఒప్పుకోబోమని సిద్దారెడ్డిపల్లె వాసులు తేల్చిజెప్పారు. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో సిద్దారెడ్డిపల్లెలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. ఇక్కడ ఉండే 3, 4, 5 తరగతులకు చెందిన 19 మంది విద్యార్థులను గ్రామ నుంచి 1.50 కిలోమీటర్ల దూరంలో ఉండే మొర్రాయిపల్లె మోడల్ స్కూల్లో విలీనం చేశారు. ఈ క్రమంలో గురువారం విద్యార్థులను తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులు రాగా తల్లిదండ్రులు పంపబోమని వారితో చెప్పారు.
గతంలో ఇదే విధంగా విద్యార్థులను పంపబోమని చెప్పినప్పటికీ.. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తమ పిల్లలను ఇంటి వద్దనైనా ఉంచుకుంటామని, దూరంగా ఉండే పాఠశాలకు మాత్రం పంపబోమన్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. ససేమిరా అన్నారు. కిలో మీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉండే పాఠశాలకు విద్యార్థులను పంపిస్తే ఆటో చార్జీల కోసం రూ.600 చెల్లించే నిబంధనలు ఉన్నప్పటికీ.. కేవలం ఇక్కడ పాఠశాలల మధ్య వ్యత్యాసం 700 మీటర్లు మాత్రమే ఉన్నట్లు చూపడంతో.. ఆటో చార్జీల చెల్లింపు అవకాశం కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు తమ పిల్లలను ఎలా పంపాలని, దారిలో నడిచి వెళితే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. తమ గ్రామం నుంచి మొర్రాయిపల్లెకు ఆటో సౌకర్యం కూడా లేకపోవడంతో.. తమ గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని తెలిపారు. లేనిపక్షంలో ఇక్కడి నుంచి తమ పిల్లలను విలీన పాఠశాలకు పంపబోమని తల్లిదండ్రులు తెగేసి చెప్పారు.
విద్యార్థులను పాఠశాలకు పంపబోమని తేల్చిచెప్పిన సిద్దారెడ్డిపల్లె గ్రామస్తులు
నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు