దేవదాయ అధికారులకు లోకాయుక్త నోటీసులు | - | Sakshi
Sakshi News home page

దేవదాయ అధికారులకు లోకాయుక్త నోటీసులు

Jun 13 2025 5:19 AM | Updated on Jun 13 2025 5:19 AM

దేవదాయ అధికారులకు లోకాయుక్త నోటీసులు

దేవదాయ అధికారులకు లోకాయుక్త నోటీసులు

ప్రొద్దుటూరు : దేవదాయ శాఖ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌తోపాటు ఈఓలకు ఈనెల 3వ తేదీన లోకాయుక్త నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణ గీతాశ్రమంలో చోటు చేసుకున్న అవినీతిపై సమాధానం చెప్పాలని లోకాయుక్త కోరింది. గీతాశ్రమంలోని ఈఓ కార్యాలయంలో అటెండర్‌గా పని చేసిన బి.జనార్ధన్‌రెడ్డికి ఈఓ రామచంద్రాచార్యులు వేతన రూపంలో రూ.5 లక్షలు చెల్లించారు. గీతాశ్రమం నిర్వహణకు సంబంధించిన డబ్బును ఇందుకోసం వినియోగించారు. గతంలో ఇదే కార్యాలయంలో పని చేసిన జనార్ధన్‌రెడ్డి ప్రవర్తన సరిగా లేకపోవడంతో.. ఆశ్రమ నిర్వాహకుడిగా ఉన్న గంగాధరానంద గిరి స్వామి తొలగించారు. 2021 జూలై నుంచి జనార్ధన్‌రెడ్డి విధులకు హాజరు కాకపోగా.. రోజూ కార్యాలయ పరిసరాలకు వచ్చి గూగుల్‌ ద్వారా ఫొటోలు తీసుకుని కోర్టును ఆశ్రయించాడు. తాను రోజు విధులకు హాజరవుతున్నానని తెలిపాడు. కోర్టు నోటీసు మేరకు గతంలో పని చేసిన దేవదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌.. జనార్ధన్‌రెడ్డి ప్రవర్తన సరిగా లేని మాట వాస్తవమేనని, గంగాధరానందగిరి స్వామి ఇచ్చిన లేఖను సమర్పిస్తూ కోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేశారు. అప్పటి నుంచి జనార్ధన్‌రెడ్డికి, గీతాశ్రమానికి సంబంధాలు లేవు. కాగా ఇటీవల ఈఓ రామచంద్రాచార్యులు అతనికి లీజు బకాయిలు ఉన్నాయని చెప్పి రూ.5 లక్షలు చెల్లించడం జరిగింది. విధులకు రాని వ్యక్తికి రూ.5 లక్షలు దేవదాయ శాఖ సొమ్మును ఎలా చెల్లిస్తారని, దీనిపై విచారణ జరిపి ఆ డబ్బును తిరిగి ప్రభుత్వానికి జమ చేయాలని కోరుతూ పర్లపాడు గౌరీశంకర్‌ అనే వ్యక్తి లోకాయుక్తలో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు దేవదాయశాఖ అధికారులకు లోకాయుక్త నోటీసులు అందాయి. ఏకంగా కమిషనర్‌ ఉత్తర్వులను కాదని ఈఓ రామచంద్రాచార్యులు అప్పనంగా జనార్ధన్‌రెడ్డికి డబ్బు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. జనార్ధన్‌రెడ్డిని తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులు, కమిషనర్‌ కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌ వివరాలు అందుబాటులో ఉన్నాయి. అన్నీ కాదని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఇలా చేశారు. ఇది ఇలా ఉండగా ఈఓగా పని చేసిన రామచంద్రాచార్యులు గత నెలాఖరునే పదవీ విరమణ చెందారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. గీతాశ్రమానికి సంబంధించి అనేక అవినీతి ఆరోపణలు వెల్లువలా ఉన్నా.. దేవదాయశాఖ అధికారులు ఇంకా నిద్రమత్తు వీడలేదు.

శ్రీకృష్ణ గీతాశ్రమంలోని అవినీతిపై ఆరా

రూ.5 లక్షల చెల్లింపుపై వివాదం

కమిషనర్‌ ఆదేశాలను తుంగలో తొక్కిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement