త్రిపురారం : మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చెట్లకు నిప్పంటుకుని తగలబడుతుండడంతో గ్రామ సర్పంచ్ గుండెబోయిన వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ అంబటి రాము గ్రామస్తులతో కలిసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సమయానికి అక్కడికి చేరుకోకపోవడంతో రెడ్డీస్ ల్యాబ్లో అందుబాటులో ఉన్న అగ్నిమాపక ట్యాంకర్ తీసుకొచ్చారు. ట్యాంకర్లో నీరు లేకపోవడంతో కొంత ఇబ్బంది తలెత్తింది. సమీపంలోని వ్యవసాయ పొలంలో గడ్డికి నిప్పు పెట్టడం వల్లే చెట్లకు నిప్పు అంటుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
వ్యాపించిన మంటలు
మాడుగులపల్లి : మండలంలోని కల్వపాలెం గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో సుమారు 25 ఎకరాల మేర మంటలు వ్యాపించాయి. ఎస్ఐ కృష్ణయ్య, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గ్రామస్తుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి వెంట సర్పంచ్ చిట్యాల సునీతాడానియేల్, సతీష్ తదితరులున్నారు.


