నీతి కథ
ఒక ఊరిలో రెండు పిల్లులు ఉండేవి. ఒకరోజు వాటికి రొట్టె ముక్క దొరికింది. ‘నేనంటే నేను ముందు చూశాను’ అని ఆ రొట్టె కోసం రెండు పిల్లులు తీవ్రంగా పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి. అప్పుడే అటుగా ఒక కోతి వచ్చింది. వాటి సమస్యను విని, ‘నేను ఈ రొట్టెను మీ ఇద్దరికీ సమానంగా పంచుతాను’ అని చెప్పి ఒక త్రాసు తీసుకువచ్చింది. రొట్టెను రెండు ముక్కలు చేసి త్రాసులో పెట్టింది. ఒకవైపు బరువుగా ఉందని, అందులో కొంచెం రొట్టెను కోతి తినేసింది. అప్పుడు రెండో వైపు బరువు ఎక్కువైందని అందులో కొంచెం తినేసింది. ఇలా పదే పదే చేస్తూ, చివరికి రొట్టె మొత్తం కోతి తినేసి అక్కడి నుంచి జారుకుంది. ఇక ఏమీ మిగలకపోవడంతో పిల్లులు రెండు నిరాశతో ఉండిపోయాయి.
నీతి : ఇద్దరి మధ్య గొడవ మూడో వ్యక్తికి లాభం చేకూరుస్తుంది. కాబట్టి మన సమస్యలను మనమే సామరస్యంగా పరిష్కరించుకోవాలి.


