సాక్షి, యాదాద్రి : ఒకే సారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి బుధవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం పౌరసరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రేషన్ దుకాణాలకు బియ్యం తరలించారు.
515 రేషన్ దుకాణాల ద్వారా..
జిల్లా వ్యాప్తంగా 515 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా 2,50,789 మంది కార్డుదారులకు 5010.345 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఈసారి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేస్తారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల చొప్పున మూడు నెలలవి కలిపి 18 కిలోలు ఇస్తారు. దీనికి సంబంధించి 15,031.035 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా కేటాయించారు.
నెల రోజుల పాటు పంపిణీ
గతంలో 15 రోజుల పాటు బియ్యం కోటా ఇచ్చే వారు. అయితే రేషన్ దుకాణాల్లో దొడ్డుబియ్యం నిల్వలు ఉండడం, మూడు నెలల కోటా ఒకేసారి నిల్వ చేసుకునే సామర్థ్యం రేషన్ దుకాణాల్లో లేకపోవడం వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి. దీంతో బియ్యం పంపిణీ నెల రోజుల పాటుకొనసాగనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలలు బియ్యం ఒకే సారి పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తెలిపారు.


