ముగిసిన జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు
● ప్రథమ బహుమతిని కై వసం చేసుకున్న
దక్షిణ మధ్య రైల్వే జట్టు
పెద్దవూర: మండలంలోని చింతపల్లిలో దున్న ఇద్దాస్ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా నాలుగు రోజుల పాటు ప్లడ్ లైట్ల వెలుతురులో లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహించిన జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిశాయి. ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 15 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి బహుమతులను అందించి మాట్లాడారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి రూ.లక్షను సౌత్ సెంట్రల్ రైల్వేస్ జట్టు, ద్వితీయ బహుమతిని రూ.80వేలను అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ హర్యానా జట్టు, తృతీయ బహుమతి రూ.60వేలు చింతపల్లి మిషన్ ఢిల్లీ జట్టు, నాలుగవ బహుమతి రూ.50వేలు కర్నాటక జట్టు, ఐదవ బహుమతి రూ.40వేలు తెలంగాణ, ఆరో బహుమతి రూ.30వేలు ఉత్తరప్రదేశ్ జట్లు గెల్చుకున్నాయి. వీరికి నగదుతో పాటు షీల్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జటావత్ రవినాయక్, మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్, క్రీడల ఆర్గనైజింగ్ కన్వీనర్ షేక్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.


