ఇంటర్నల్ తనిఖీలు
మార్కుల పరిశీలన పక్కాగా నిర్వహిస్తాం
భువనగిరి: టెన్త్ విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల పరిశీలన ప్రక్రియను ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సబ్జెక్టుకు 100 మార్కుల్లో 20 మార్కులు ఇంటర్నల్ కింద కేటాయిస్తారు. ఈ మార్కుల పరిశీలన కోసం ప్రత్యేక బృందాలు పాఠశాలలను సందర్శించి పరిశీలించనున్నారు.
21 బృందాలు ఏర్పాటు
పదో తరగతి ఇంటర్నల్ మార్కుల పరిశీలన కోసం జిల్లాలో మొత్తం 21 బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున ఉంటారు. వీరిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడితో పాటు లాంగ్వేజ్ ఉపాధ్యాయుడు, నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ సభ్యులుగా ఉంటారు. వీరికి కేటాయించిన పాఠశాలల్లో విద్యార్థులకు మార్కులు సక్రమంగా వేశారా లేదా అక్రమాలకు పాల్పడ్డారా లేదా అనే విషయాలను పరిశీలిస్తారు.
జిల్లాలో 8891 మంది విద్యార్థులు
జిల్లాలో పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 265 వరకు ఉన్నాయి. ఇందులో 2025–26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 8891 మంది ఉన్నారు. వీరిలో 163 ప్రభుత్వ పాఠశాలల్లో 5063, వివిధ రకాల 31 గురుకులాల్లో 1187, 71 ప్రైవేట్ పాఠశాలల్లో 2641 మంది విద్యార్థులున్నారు. ఆయా విద్యార్థులకు సంబంధించి మార్కులను పరిశీలించనున్నారు. ప్రైవేట్ పాఠశాలలు కుమ్మకై 20 ఇంటర్నర్ మార్కులు వేస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో ఈసారి పరిశీలన పక్కాగా చేసేందుకు చర్యలు చేపట్టారు.
ఫ టెన్త్ ఇంటర్నల్ మార్కుల
పరిశీలనకు ప్రత్యేక బృందాలు
ఫ 12 నుంచి 17 వరకు
కొనసాగనున్న ప్రక్రియ
ఫ ఒక్కో బృందంలో
ముగ్గురు చొప్పున నియామకం
పదో తరగతి ఇంటర్నర్ మార్కుల పరిశీలన పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మార్కులు సక్రమంగా వేశారా లేదా అనేది ప్రత్యేక బృందాలు పరిశీలిస్తారు. ఇష్టానుసారంగా మార్కులు వేసినట్లు పరిశీలనలో తేలితే చర్యలు తప్పవు. మార్కుల పరిశీలన అనంతరం వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలి.
– సత్యనారాయణ, డీఈఓ


