ఇసుక దందాను అరికట్టాలి
ఆలేరురూరల్ : ఆలేరు మండలం సాయిగూడెం పరిధిలోని వాగులో నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో వ్యవసాయ బావులు, బోర్లు ఎండిపోతున్నాయని, వేసవిలో సాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక దందాను అడ్డుకున్న గ్రామానికి చెందిన పుట్ట పవన్పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. పోలీసులను వివరణ కోరగా.. పుట్ట పవన్ వ్యవసాయ బావి వద్ద నుంచి ట్రాక్టర్లో బొడ్డు మల్లేష్ ఇసుక తరలిస్తుండగా పవన్ అడ్డుకున్నాడని.. వాగ్వాదం చోటుచేసుకుందనేది వాస్తవమని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు.


