విద్యుత్ సమ్మర్ ప్లాన్
పనులు త్వరగా పూర్తి చేస్తాం
భువనగిరి : వేసవి కాలంలో విద్యుత్ వాడకం పెరుగుతుంది. అందుకు తగినట్లుగా సరఫరా లేకపోతే లోఓల్టేజీ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఈదురు గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ లైన్లు పాడైతే అత్యవసరంగా మరమ్మతులు చేయడం అంత సులభం కాదు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు విద్యుత్శాఖ వేసవి యాక్షన్ప్లాన్ రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా రూ.30కోట్లతో పనులు చేపట్టింది. వచ్చే నెలాఖరు వరకు వీటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోంది.
సుమారు రూ. 30 కోట్లతో పనులు
విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు సుమారు రూ. 30కోట్లతో సబ్ స్టేషన్లు, ఇంటర్ లింక్ పనులు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, వ్యవసాయం, లైట్ల కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గుండాల మండలం సీతారామపురం, రాజాపేట మండలం దూదివెంకటాపురం, బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి, యాదగిరిగుట్ట మండలం సైదాపురం, ఆలేరు మండలం మాటూరు, అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామాల పరిధిలో సుమారు రూ. 20 కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సంబంధించిన పనులు ఆయా గ్రామాల్లో కొసాగుతున్నాయి. 11కేవీ సబ్ స్టేషన్ల మధ్య 15 ఇంటర్ లింక్ లైన్ల పనులు చేపట్టగా వీటిలో ఒకటి పూర్తి అయ్యింది. 33 కేవీ సబ్స్టేషన్ల మధ్య 19 ఇంటర్ లింక్ లైన్ల పనులకు గాను ఒకటి పూర్తి కాగా 18 పనులు సాగుతున్నాయి. వీటితో పాటు జిల్లాలో 20 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎనిమిది ఏర్పాటు చేశారు. వీటితో పాటు వ్యవసాయం, లైట్ల కోసం ప్రత్యేకంగా 170 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 41 ఏర్పాటు చేశారు.
వినియోగదారులు
ఇబ్బంది పడకుండా..
సబ్ స్టేషన్ల మధ్య ఇంటర్ లింక్లైన్ల పనులు చేపట్టడం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉంటుంది. ఈ పనులు పూర్తయితే అత్యవసర సమయాల్లో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడితే గంటల తరబడి సమయం పడితే వినియోగదారులు ఇబ్బంది పడకుండా క్షణాల్లో విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉంటుంది. సబ్ స్టేషన్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ఇంటర్ లింక్లైన్ల పనులన్నీ ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తి చేయనున్నారు.
వచ్చే వేసవి, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందులో భాగంగా సరఫరాలో అంతరాయం లేకుండా అదనంగా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు సబ్ స్టేషన్ల మధ్య ఇంటర్ లింక్ లైన్ల పనులు సైతం చేపడుతున్నాం. ఈ పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– సురేష్, ఎస్ఈ, జిల్లా విద్యుత్ శాఖ
ఫ అంతరాయం లేకుండా కరెంటు
సరఫరాకు అధికారుల చర్యలు
ఫ జిల్లాలో రూ.30కోట్లతో పనులు
ఫ కొనసాగుతున్న ఆరు 33/11 కేవీ సబ్స్టేషన్ల పనులు
ఫ 34 ఇంటర్ లింక్ లైన్ల పనులు కూడా..
ఫ వచ్చే నెలాఖరు వరకు పూర్తి చేసేలా కార్యాచరణ


