పంచాయతీ హస్తగతం
యాదాద్రి జిల్లాలో
కాంగ్రెస్కు 228 స్థానాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారులకే అత్యధిక సర్పంచ్ స్థానాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి, యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఆ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి 63.90 శాతం స్థానాలు లభించగా, బీఆర్ఎస్కు 26.71 శాతం స్థానాలు, బీజేపీకి 1.23 శాతం స్థానాలు వచ్చాయి. సీపీఐ/సీపీఎం/ఇతరులకు 8.15 శాతం స్థానాలు దక్కాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం బుధవారంతో ముగిసింది. ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. ఈ నెల 11, 14వ తేదీల్లో ఒకటి, రెండు విడతల ఎన్నికలు జరగ్గా, మూడో విడత ఎన్నికలు బుధవారం ముగిశాయి.
1779 పంచాయతీల్లో ఎన్నికలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడతల్లో 1782 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అయితే, నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం పేరూరు, మాడుగులపల్లి మండలం అభంగాపురంలో సర్పంచి అభ్యర్థుల్లేక సర్పంచ్ స్థానాలకు, అదే మండలంలోని ఇందుగులలో న్యాయ వివాదంతో సర్పంచ్తో సహా వార్డుల సభ్యుల స్థానాల ఎన్నికలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని 1779 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు, 1781 గ్రామాల్లో వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో రాత్రి 11:30 గంటల వరకు కూడా లెక్కింపు పూర్తి కాలేదు.
వివిధ పార్టీల మద్దతుదారులకు ఇలా..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు వితల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అత్యధిక స్థానాలు దక్కాయి. సర్పంచి ఎన్నికలు జరిగిన 1779 స్థానాల్లో (జనగాం మినహా) కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు 1136 స్థానాలు దక్కాయి. బీఆర్ఎస్ మద్దతుదారులకు 475 స్థానాలు వచ్చాయి. బీజేపీకి 22 స్థానాలు రాగా, సీపీఐ/సీపీఎం/ఇతరులకు 145 స్థానాలు లభించాయి. అందులో స్వతంత్ర అభ్యర్థులే అత్యధికంగా ఉండటం గమనార్హం.
యాదాద్రి జిల్లాలో మూడో విడతలో
సత్తా చాటిన కాంగ్రెస్ మద్దతుదారులు
తుది దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను చేజిక్కించుకుంది. 124 పంచాయతీలకు గాను 69 స్థానాలను (8 చోట్ల ఏకగ్రీవం) కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు చేజిక్కించుకున్నారు. బీఆర్ఎస్ 36 స్థానాలను (ఒకటి ఏకగ్రీవం) గెలుచుకోగా, బీజేపీ 7, సీపీఐ 2, సీపీఎం, ఇండిపెండెంట్లు 9 చోట్ల (ఒకరు ఏకగ్రీవం) గెలుపొందారు. ఆలేరు నియోజకవర్గంలోని మోటకొండూరు మేజర్ పంచాయతీతో పాటు 14 చోట్ల కాంగ్రెస్ గెలుపొందగా, బీఆర్ఎస్ ఐదు సీట్లకే పరిమితం అయ్యింది. గుండాల మండలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పదేసి స్థానాల్లో విజయం సాఽధించాయి. కాగా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురంలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకుంది. 32 స్థానాలు కాంగ్రెస్ గెలువగా, బీఆర్ఎస్ మద్దతుదారులు 10 మంది గెలిచారు. ఈ విడతలో బీజేపీ పుంజుకుని 7 చోట్ల విజయం సాధించింది. మేజర్ గ్రామ పంచాయతీలు సంస్థాన్నారాయణపురం, పుట్టపాకలో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 17 చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ 8 సీట్లు కై వసం చేసుకుంది. ఇండిపెండెంట్లు తొమ్మిది స్థానాల్లో విజయం సాఽధించారు.
జిల్లా వ్యాప్తంగా జరిగిన 427 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ 228 స్థానాలను గెలుచుకుని ఆధిక్యతను ప్రదర్శించింది. బీఆర్ఎస్ 150, బీజేపీ 11 స్థానాల్లో గెలుపొందాయి. సీపీఐ, సీపీఎం, ఇతరులు 38 చోట్ల విజయం సాధించారు. ఇందులో కాంగ్రెస్ రెబల్స్ కూడా ఉన్నారు.
పంచాయతీ హస్తగతం


