నీటి గుంతలో పడి బాలుడు మృతి
కేతేపల్లి: అంగన్వాడీ పాఠశాలకు వెళ్లిన బాలుడు నీటిగుంతలో పడి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కేతేపల్లి మండలంలోని కాసనగోడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసనగోడు గ్రామానికి చెందిన కుంచం జగదీష్కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఆయాన్(4)ను స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లిన ఆయాన్ను బహిర్భూమి కోసం సిబ్బంది ఆరుబయటికి తీసుకెళ్లారు. పాఠశాల పక్కనే నీటి గుంత వద్దకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన అంగన్వాడీ ఆయా ఆయాన్ను బయటకు తీసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. బాలుడిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై దాడి చేసేందుకు యత్నించారు. వారు భయంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న కేతేపల్లి ఎస్ఐ సతీష్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. అంగన్వాడీ కేంద్రం సిబ్బందిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలుడి తండ్రి జగదీష్ ప్రస్తుతం పనినిమిత్తం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లినట్లు తెలిసింది.
నలుగురు సిబ్బంది ఉన్నా..
కాసనగోడు గ్రామంలో రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రెండింటిలో కలిపి పది మందికి లోపే పిల్లలు ఉండడంతో రెండు కేంద్రాలను కలిపి ఒకే భవనంలో నిర్వహిస్తున్నారు. కేంద్రం నిర్వహణకు ఇద్దరు టీచర్లు, ఇద్దరు ఆయాలు మొత్తం నలుగురు సిబ్బంది ఉన్నారు. సోమవారం పాఠశాలకు ఏడుగురు విద్యార్థులు మాత్రమే వచ్చినప్పటికీ వారి పర్యవేక్షణపై సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలుడు నీటిగుంతలో పడి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు పక్కా భవనం, ప్రహరీ, మరుగుదొడ్లు సౌకర్యం ఉన్నప్పటికీ బాలుడిని బహిర్భూమికి ఆరుబయటకు ఎందుకు తీసుకెళ్లారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
మృతదేహంతో ఆందోళన
అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలుడు నీటిగుంతలో పడి మృతి చెందాడని ఆరోపిస్తూ బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు, అంగన్వాడీ టీచర్ ఇంటి ఎదుట బాలుడి మృతదేహాన్ని ఉంచి ఆందోళకు దిగారు. బాలుడి మృతికి కారణమైన సిబ్బందిని సస్పెండ్ చేయటంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేతేపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆందోళన విరమించాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రాత్రి వరకు మృతదేహంతో ఆందోళన చేశారు.
ఫ బహిర్భూమి కోసం అంగన్వాడీ విద్యార్థిని సిబ్బంది ఆరుబయటికి తీసుకెళ్లడంతో ఘటన
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
నల్లగొండ: నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ సంఘటన అంగన్ వాడీ కేంద్రం బయట జరిగినప్పటికీ సంబంధిత అంగన్వాడీ టీచర్, ఆయాలపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
నీటి గుంతలో పడి బాలుడు మృతి


