జూబ్లీహిల్స్‌లో లాల్‌సింగ్‌ నాయక్‌ నామినేషన్‌ | - | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో లాల్‌సింగ్‌ నాయక్‌ నామినేషన్‌

Oct 15 2025 6:20 AM | Updated on Oct 15 2025 6:20 AM

జూబ్లీహిల్స్‌లో లాల్‌సింగ్‌  నాయక్‌ నామినేషన్‌

జూబ్లీహిల్స్‌లో లాల్‌సింగ్‌ నాయక్‌ నామినేషన్‌

త్రిపురారం: త్రిపురారం మండలంలోని లచ్యతండా గ్రామ పంచాయతీకి చెందిన పానుగోతు లాల్‌సింగ్‌నాయక్‌ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు గాను మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. లాల్‌సింగ్‌నాయక్‌ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా.. గతంలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోనూ పలుమార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

నేరేడుచర్ల: షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన నేరేడుచర్ల పట్టణంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు రామాపురంలో నివాసముంటున్న శ్రీరాముల వెంకటేష్‌ తన భార్యతో కలిసి మంగళవారం కూలీ పనులకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతడి ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు వ్యాపించాయి. ఇల్లు మొత్తం దగ్ధం కావడంతో సుమారు రూ.1.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు పేర్కొన్నాడు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నరసయ్య ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ద్విచక్ర వాహనంలో మంటలు

హుజూర్‌నగర్‌: పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన హుజూర్‌నగర్‌ పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్‌ పట్టణంలోని పబ్లిక్‌ క్లబ్‌ వద్ద మూసి ఉంచిన దుకాణం వద్ద పార్కింగ్‌ చేసిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో బైక్‌ సీటు, ట్యాంక్‌ భాగం కొంత వరకు కాలిపోయింది. స్థానికులు గమనించి మంటలను ఆర్పారు.

మట్టపల్లిలో నాఖాబందీ˘

మఠంపల్లి: మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద గల అంతర్‌ రాష్ట్ర చెక్‌పోస్ట్‌లో మంగళవారం రాత్రి స్థానిక పోలీసులు నాఖాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ పి. బాబు మాట్లాడుతూ.. సరిహద్దు నుంచి గంజాయి అక్రమంగా తరలకుండా, నేరాలను అదుపు చేయడంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాఖాబందీ నిర్వహించినట్లు తెలిపారు.

సాగర్‌ వెనుక జలాల్లో

యువకుడి గల్లంతు

చందంపేట: నేరెడుగొమ్ము మండలం వైజాక్‌ కాలనీ వద్ద సాగర్‌ వెనుక జలాల్లో మంగళవారం ఓ యవకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన తిన్నారపు పృథ్వీరాజ్‌(26) హైదరాబాద్‌లో ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్నాడు. మంగళవారం తన నలుగురు స్నేహితులతో కలిసి వైజాక్‌ కాలనీకి వచ్చాడు. ఈ క్రమంలో పృథ్వీరాజ్‌ ఈత కొట్టేందుకు సాగర్‌ వెనుక జలాల్లోకి దిగి గల్లంతయ్యాడు. అతడి స్నేహితులు గమనించి స్థానికులకు విషయం చెప్పగా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు గాలించినా పృథ్వీరాజ్‌ ఆచూకీ తెలియరాలేదని ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement