
బెంచ్ దిగివచ్చి.. గోడు విని..
నకిరేకల్ : ఓ కేసులో నిందితురాలుగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలు కోర్టు మెట్లు ఎక్కలేని స్థితిలో ఉండగా.. జడ్జి స్వయంగా ఆమె వద్దకు వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన యాతాకుల రామనర్సమ్మ (80) ఓ కేసులో నిందితురాలిగా ఉంది. కేసు సోమవారం నకిరేకల్ జూనియర్ సివిల్ కోర్టులో బెంచ్పైకి వచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న రామనర్సమ్మ.. కోర్టుకు ఆటోలో వచ్చింది. కానీ కోర్టులోకి వెళ్లలేకపోయింది. దీంతో జడ్జి షేక్ ఆరీఫ్.. ఆటోలో ఉన్న రామనర్సమ్మ దగ్గరుకు వచ్చి ఎగ్జామినేషన్ చేశారు. ఆమె చెప్పిన సమాధానాన్ని రికార్డు చేశారు.
ఎఫ్సీఐ బీకేఎన్కే ఉమ్మడి జిల్లా కార్యవర్గం ఎన్నిక
నల్లగొండ: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) ఉద్యోగుల అనుబంధ సంఘమైన భారతీయ ఖాద్య నిగమ్ కర్మచారి (బీకేఎన్కే) సంఘం ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని ఆ యూనియన్ తెలంగాణ ప్రాంత సీనియర్ ఉపాధ్యక్షుడు సతీష్రెడ్డి, సీనియర్ అదనపు కార్యదర్శి రాహుల్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని ఎఫ్సీఐ కార్యాలయంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గోపయ్య, కార్యదర్శిగా శ్రీకాంత్రెడ్డి, మరికొందరు సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్ష, కార్యవర్శులు మాట్లాడుతూ.. సంస్థలోని ఉద్యోగుల సంక్షేమానికి యూనియన్ జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో అనేక పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, అరుణ్, దివ్య, రూప, కిరణ్, మధు, అజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.
రెండు గేట్ల ద్వారా
సాగర్ నీటి విడుదల
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గింది. సోమవారం 68,090 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండగా.. రెండు క్రస్ట్ గేట్ల ద్వారా 16,158 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,008 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీ, కుడి, ఎడమ కాల్వలకు 18,924 క్యూసెక్కులు మొత్తం 68,090 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590అడుగులు(312.0450 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 589.80అడుగులు(311.4474 టీఎంసీలు)గా నీటి మట్టం ఉంది.
మూసీ ప్రాజెక్టుకు
కొనసాగుతున్న వరద
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. సోమవారం ప్రాజెక్టులోకి 1,711 క్యూసెక్కుల వరద వస్తుండగా.. ప్రాజెక్టు అధికారులు ఒక క్రస్టు గేటును పైకెత్తి 1,321 క్యూసెక్కుల నీటిని దిగువ వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644.50 అడుగుల మేర నీటి మట్టం ఉంది. కుడి, ఎడమ కాల్వలకు 341 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపలో 50 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి విడుదలవుతోంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.30 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

బెంచ్ దిగివచ్చి.. గోడు విని..