
తొలగించకుంటే ముప్పే!
ఆలేరు: ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని పెద్దవాగుపై నిర్మించిన పురాతన వంతెన పెచ్చులూడుతూ శిథిలావస్థకు చేరింది. నేషనల్ హైవే అథారిటీ పరిధిలో ఉన్న ఈ వంతెన పునర్నిర్మాణంపై నేటికీ చిక్కుముడి వీడడం లేదు. ఇక తమ పరిధిలో లేదనే సాకుతో రోడ్లు, భవనాల శాఖ అధికారులూ పట్టించుకోని పరిస్థితి. హైదరాబాద్–వరంగల్ నగరాల మధ్య రాకపోకలకు ప్రధాన మార్గమైన పెద్దవాగుపై ఉన్న ఈ వంతెన విషయంలో పాలకుల ఊదాసీనతతో ఏళ్లుగా పునర్నిర్మాణానికి నోచుకోవడం లేదు. దాదాపు వందేళ్ల కిత్రం నిజాం కాలంలో పెద్దవాగుపై నిర్మించిన ఈ పురాతన వంతెన శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా ఈ పురాతన వంతెనను తొలగించి కొత్తది నిర్మించకపోతే పెద్ద ముప్పే పొంచి ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
ఎన్హెచ్ఏ, ఆర్అండ్బీ ఎవరికి వారే..
2009 సంవత్సరానికి కాస్తా అటు ఇటుగా ఆలేరుకు రెండో విడతలో బైపాస్ రోడ్డు మంజూరైంది. ఆలేరు శివారులోని సాయిబాబా దేవాలయం నుంచి పట్టణం, పెద్దవాగు వంతెన మీదుగా స్థానిక ఎంపీడీఓ, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు బైపాస్ ప్రాజెక్టు పనులపై నేషనల్ హై అథారిటీస్ అప్పట్లో ప్రతిపాదనలు చేసింది. ఆలేరు కోర్టు భవనం సమీపంలో జరిగిన సమావేశంలో పట్టణం మీదుగా బైపాస్ పనులు చేపడితే వ్యాపార సముదాయాలు, పలు గృహాలు కోల్పోవాల్సి వస్తుందని కొందరు వ్యాపారులు ఈ ప్రతిపాదనలను తిరస్కరించారు. దాంతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు బైపాస్ అలైన్మెంట్ను పట్టణం మీదుగా కాకుండా వేరే మార్గంలో మార్చారు. తర్వాత వ్యాపారులు తమ నిర్ణయాన్ని మార్చుకొని, పట్టణం మీదుగా బైపాస్ పనులకు సుముఖత చూపారు. ఈ విషయాన్ని అప్పటి ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఎన్హెచ్ అధికారులతో మాట్లాడగా అలైన్మెంట్ ప్రతిపాదనలు ఫైనల్ అయ్యాయని, మళ్లీ మార్చడానికి వీలుకాదని సమాధానం ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి మొదట చేసిన ప్రతిపాదిత అలైన్మెంట్ ప్రకారం వంతెన మార్గం తదితర ప్రాంతాలు ఎన్హెచ్ పరిధిలో ఉండిపోయాయి. దాంతో పునర్నిర్మాణానికి లేదా కనీసం మరమ్మతులకు వంతెన నోచుకోడం లేదు. ఎన్హెచ్ఏ, ఆర్అండ్బీ అధికారులు మాత్రం శిథిలవుతున్న వంతెన విషయమై అడిగితే ఎవరికి వారు తమ పరిధిలోనిది కాదని అంటున్నారు.
వందలాదిగా వాహనాల రాకపోకలు
ఆలేరు నుంచి జనగాం, పెంబర్తి గుండాల, మోత్కూరు, జీడికల్, అనంతారం తదితర ప్రాంతాలకు వాహనాల రాకపోకలకు పెద్దవాగుపై ఈ వంతెనే ప్రధాన వారధి. ఈ వంతెన దాదాపు 400 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్నచిన్న గ్రామాలకు వెళ్లాలన్నా ఈ వంతెన మీదుగానే ప్రయాణించాలి. ఆర్టీసీ బస్సులతోపాటు రోజు వందలాది వాహనదారులు ఈ వంతెన మీదుగా ఆయా గ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటారు.
ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా..
వాగు నుంచి అడ్డగోలుగా ఇసుక తరలించకపోవడంతో వంతెన పునాది భాగంలో నేల కుంగిపోతోంది. భారీ వాహనాలు లోడ్తో వెళ్లినప్పుడు వంతెన కిందభాగం పెచ్చులూడుతూ ఇనుప చువ్వలు తేలాయి. పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. వంతెనకు ఇరువైపులా రక్షణ దిమ్మెలు సరిగా లేవు. ద్విచక్ర వాహనదారులు వంతెనపై పలు సందర్భాల్లో ప్రమాదానికి గురైనప్పుడు వాగులో పడిపోయిన సంఘటనలూ ఉన్నాయి.
ఆలేరు పెద్దవాగుపై శిథిలావస్థలో వందేళ్ల నాటి వంతెన
ఫ బ్రిడ్జి కిందిభాగంలో పెచ్చులూడి
తేలిన చువ్వలు
ఫ ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి
ఫ హైదరాబాద్–వరంగల్ మధ్య
రాకపోకలకు ఇదే ప్రధాన వారధి
ఫ ఆందోళనలో వాహనదారులు

తొలగించకుంటే ముప్పే!