
ప్రాదేశిక పోరుకు సై
సాక్షి, యాదాద్రి : జెడ్పీ, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాల తొలి విడత ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. నోటిఫికేషన్ విడుదల రోజు నుంచే ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు ఇప్పటికే జిల్లాలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లాలో మొత్తం 178 ఎంపీటీసీ స్థానాలు, 17 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో తొలి విడతలో భాగంగా ఈ నెల 23న ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది, తుంగతుర్తి నియోజకవర్గంలోని రెండు మండలాల్లో 84 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే రెండో విడతలో భాగంగా భువనగిరి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లోని 7 జెడ్పీటీసీ, 94 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరుగుతాయి.
నేటినుంచే నామినేషన్ల స్వీకరణ
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు అధికారులు ఆయా స్థానాల వారీగా రిటర్నింగ్ అధికారులు రిజర్వేషన్లు, ఓటరుజాబితాలను ప్రకటిస్తారు. నామినేషన్లను మూడు రోజుల వరకు అంటే ఈనెల 11 వరకు స్వీకరిస్తారు. 12న పరిశీలన, 15వ తేదీన ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఈనెల తొలి విడత 23 పోలింగ్ జరుగనుంది. నవంబర్ 11న ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు
అన్ని మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టారు. అన్ని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. ఈ డెస్క్ల్లో పనిచేసే సిబ్బంది నామినేషన్ ఫారాలు, ఇతర సలహాలు ఇస్తారు.
అష్టమి, నవమి లేదు..
ఈనెల 8 నుంచి 11 వరకు నామినేషన్లు వేయడానికి ఎన్నికల అధికారులు సమయం ఇచ్చారు. నామినేషన్లు వేసే మూడు రోజల్లో అష్టమి, నవమి లేకపోవడం అభ్యర్థులకు సెంటిమెంట్గా కలిసి వచ్చే అంశం. గురువారం, శనివారం దివ్యమైన రోజులుకాగా, శుక్రవారం చవితి ఉంది. కాబట్టి గురువారం, శనివారం ఎక్కువగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. కాగా బీసీ రిజర్వేషన్లపై గురువారం హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే అభ్యర్థుల ఖరారు
పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. తొలి విడతలో జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రధాన పార్టీలు దాదాపు ఖరారు చేశాయి. మూడు రోజుల సమయం ఉన్నందున నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించబోతున్నాయి.
ఎన్నికలు జరిగే స్థానాలు
జెడ్పీటీసీలు ఎంపీటీసీలు
ఆలేరు గొలనుకొండ,కొలనుపాక–1, కొలనుపాక–2, కొల్లూరు, రాఘవాపురం, శారాజీపేట, టంగుటూరు.
రాజాపేట బేగంపేట, బొందుగుల, చల్లూరు, దూదివెంకటాపూర్, నెమిల, పాముకుంట, పారుపల్లి, రఘునాథపురం, రాజాపేట, రేణికుంట, సింగారం.
యాదగిరిగుట్ట చిన్నకందుకూరు, చొల్లేరు, దత్తాయపల్లి, గౌరాయపల్లి, మల్లాపూర్, మాసాయిపేట, పెద్దకందుకూరు, సాదువెల్లి, వంగపల్లి.
మోటకొండూరు అమ్మనబోలు, చాడ, చందేపల్లి, కాటేపల్లి, మాటూరు, మోటకొండూరు–1, మోటకొండూరు–2.
అడ్డగూడూరు అడ్డగూడూరు, చౌళ్లరామారం, డి.రేపాక, గట్టుసింగారం, జానకిపురం, కోటమర్తి, వెల్దేవి.
మోత్కూరు దాచారం, దత్తప్పగూడెం, ముషిపట్ల, పాటిమట్ల, పొడిచేడు.
బొమ్మలరామారం బొమ్మలరామారం, చీకటిమామిడి, చౌదర్చిపల్లి, గోవిందుతండా, జలాల్పూర్, మర్యాల, మేడిపల్లి, నాగినేనిపల్లి, ప్యారారం, రామలింగంపల్లి, తిమ్మాపూర్.
తుర్కపల్లి దత్తాయపల్లి, ధర్మారం, గంధమల్ల, మాధాపూర్, ముల్కలపల్లి, నాగాయపల్లి, రుస్తాపూర్, తుర్కపల్లి, వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి.
ఆత్మకూర్(ఎం) ఆత్మకూర్(ఎం), కప్రాయపల్లి, కొరటికల్, కూరెల్ల, పల్లెర్ల, పారుపల్లి, రహీంఖాన్పేట, సింగారం.
గుండాల అంబాల, అనంతారం, గుండాల, మరిపడిగ, పెద్దపడిశాల, సీతారాంపూర్, సుద్దాల, వస్తాకొండూరు, వెల్మజాల.
తొలి విడత ఎన్నికలకు నేడే నోటిఫికేషన్ విడుదల
ఫ 10 జెడ్పీటీసీ, 84 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
ఫ నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ
ఫ ఈ నెల 23వ తేదీన పోలింగ్
ఫ నవంబర్ 11న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి