
ట్రాన్స్ఫార్మర్ల కష్టాలు!
జిల్లాలో ఆరు రిపేరింగ్ కేంద్రాలు
సాక్షి, యాదాద్రి : వ్యవసాయ బోరు బావుల వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు తరుచూ కాలిపోతున్నాయి. లో ఓల్టేజీ, ఓవర్లోడ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు మాటిమాటికి మరమ్మతులకు గురవుతుండంతో వీటిని బాగుచేయించుకోవడానికి రైతులు నానాఅవస్థలు పడుతున్నారు. ప్రధానంగా ఒక్క నెలలోనే రెండు సార్లు కాలిపోతుండడంతో రిపేర్ సెంటర్కు తీసుకువెళ్లి మరమ్మతుల అనంతరం తిరిగి తెచ్చుకోవడానికి రైతులకు రవాణా చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి.
ఓవర్లోడ్ సమస్య
ప్రధానంగా వరిసాగుచేసే రైతులకు విద్యుత్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కెపాసిటీకి మించిన మోటార్ల వాడకం పెరిగింది. దీనికితోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పిడుగులు పడి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. ఎర్తింగ్ సరిగారాకపోవడం, కాలం చెల్లిన ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్లు, ఐదారు సార్లు వైరింగ్ చేయడం, లూజ్ లైన్లు, నాసిరకం వైండింగ్ చేయడం వంటి వాటితో వెంటనే కాలిపోతున్నాయి. మొదటిసారి కాలిపోయినప్పుడు ఒకటి రెండు రోజుల్లోనే రైతులకు ట్రాన్స్ఫార్మర్ ఏసీపీఎం కేంద్రాల్లో ఇస్తున్నారు. అలా ఇచ్చిన ట్రాన్స్ఫార్మర్ వెంటనే రీఫెయిల్ అయితే మాత్రం నాలుగైదు రోజుల సమయం పడుతోంది.
ప్రైవేట్ వాహనాలే దిక్కు..
పొలాల వద్ద కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల రవాణా కోసం టీజీఎస్పీడీసీఎల్ వాహనాలు అందుబాటులోకి రావడం లేదు. దీంతో రైతులు జేబుల్లోంచి డబ్బులు జమ చేసుకుని రవాణా చార్జీలు, రిపేర్ సెంటర్ వద్ద ఎత్తుడు, దించుడు కూలీల డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ తెచ్చిన రైతు పేరు, ట్రాక్టర్ నంబర్, అతడి బ్యాంకు అకౌంట్ నంబర్ ఆన్లైన్లో ఎంటర్ చేస్తే దూరాన్ని బట్టి రవాణా చార్జీలు టీజీఎస్పీడీసీఎల్ అందించాలి. కానీ దీనిపై రైతులకు అవగాహన లేకపోవడంతో రవాణా చార్జీలు, ట్రాన్స్ఫార్మర్ ఎత్తడం, దించడం వంటి వాటికి రైతులే తమ సొంతంగా చెల్లిస్తున్నారు.
జిల్లాలో ఆరు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్లు ఉన్నాయి. భువనగిరి, బీబీనగర్, మోత్కూరు, ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్ కేంద్రాల్లో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేస్తున్నారు. గత జూన్ నుంచి ఇప్పటి వరకు 1202 ట్రాన్స్ఫార్మర్లను రిపేర్ చేసి రైతులకు అప్పగించారు. ట్రాన్స్ఫార్మర్ల రిపేర్కు ఒకటి నుంచి రెండు రోజుల సమయం పడుతోంది.
ఫ తరచూ కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు
ఫ మరమ్మతుల కోసం రైతుల అవస్థలు
ఫ తడిసి మోపెడవుతున్న రవాణా ఖర్చులు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లికి చెందిన రైతులు. తమ వ్యవసాయ బోరుబావికి చెందిన ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో గురువారం భువనగిరిలోని ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్కు ట్రాక్టర్ సాయంతో తీసుకువచ్చారు. రవాణా కోసం టీజీఎస్పీడీసీఎల్ వాహనాలు అందుబాటులోకి తీసుకురావడం లేదని, తామే సొంతంగా రవాణా చార్జీలు చెల్లించి ప్రైవేట్ వాహనాల్లో తీసుకురావాల్సి వస్తోందని వాపోతున్నారు.

ట్రాన్స్ఫార్మర్ల కష్టాలు!

ట్రాన్స్ఫార్మర్ల కష్టాలు!