
మన చేనేత.. ఘనత
కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు 13 మంది చేనేత కార్మికులు ఎంపిక
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని
చేనేతలో విశేష ప్రతిభ కనబర్చిన కళాకారులను ప్రతి యేటా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుతో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సత్కరిస్తోంది. ఈ అవార్డుకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు చేనేత కళాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పుసర్కరించుకుని హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ
శైలజా రామయ్యర్ చేతులమీదుగా వారు రూ.25వేల నగదు పురస్కారం, మెమొంటో,
ప్రశంసా పత్రం అందుకోనున్నారు.
జీవ వైవిధ్యం ప్రతిబింబించేలా
మడ్తాస్ ఇక్కత్ చీర
భూదాన్పోచంపల్లి: పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు మంగళపల్లి శ్రీహరి వినూత్న డిజైన్లతో మడ్తాస్ ఇక్కత్ చీరను రూపొందించి ఉత్తమ వీవర్గా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. ఏడాది పాటు కష్టపడి 234 కొయ్యలు, రిపిట్ లేకుండా ఆరు వరుసల్లో వైట్ బేస్ చీరలో ప్రకృతి అందాలతో పరవశించి నృత్యం చేస్తున్న అంబారీ, నెమలిని రూపొందించారు. అంతేకాక మధ్యమధ్యన మన తెలంగాణ పండుగను ప్రతిబించేలా బతుకమ్మ, పద్మాల డిజైన్లను వేశారు. డిజైన్లు స్పష్టంగా కన్పించేలా వైట్ బేస్ చీరలో ఆనంద, బ్లాక్, మెరూన్, పసుపు, ఆకుపచ్చ రంగులను వినియోగించారు. డిజైన్లును రూపొందించడం, వాటిని గ్రాఫ్పై గీయడం, అందుకనుగుణంగా చిటికి కట్టడం, మగ్గం నేయడం కోసం మూడు నెలలు కష్టపడినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాక ఆయన నాలుగు మగ్గాలను పెట్టి నాలుగు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. తాను పడిన కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందని శ్రీహరి ఆనందం వ్యక్తం చేశారు.
50 ఏళ్ల కష్టానికి దక్కిన ఫలితం
గట్టుప్పల్: గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు గుర్రం యాదయ్య గత 50 ఏళ్లుగా చేనేత వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. చేనేతలో కొత్త కొత్త డిజైన్లు తయారు చేస్తేనే మార్కెట్లో మంచి ఆదరణ ఉంటుందని గుర్తించి.. తన భార్య జయమ్మ సహకారంతో పోచంపల్లి డబుల్ ఇక్కత్ మల్బరీ సిల్క్తో వైరెటీ చీర తయారు చేశారు. ఇందుకు గాను ఆయన కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికయ్యారు.
నలభై ఏళ్ల అనుభవానికి గుర్తింపు
వలిగొండ: మండలంలోని గొల్లపల్లికి చెందిన చేనేత కార్మికుడు చల్లమల్ల కృష్ణ కొండా లక్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. గత 40 ఏళ్లుగా చేనేత కళాకారుడిగా పనిచేస్తున్న ఆయన తెల్ల రుమాల్, డబుల్ ఇక్కత్ 100% కాటన్ చీరలు నేస్తున్నారు. తన అనుభవానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తనను కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపిక చేసిందని ఆయన అన్నారు. అవార్డుకు ఎంపికై న కృష్ణను కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అభినందించారు.
డబుల్ ఇక్కత్ చీర నేస్తున్న చిట్టిప్రోలు ధనుంజయ్య
త్రీడీ ఎఫెక్ట్తో రూపొందించిన చీర
సంస్థాన్ నారాయణపురం:రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని పుట్టపాక గ్రామానికి చెందిన సామల భాస్కర్ ఎంపికయ్యారు. భాస్కర్ తన 33 సంవత్సరాల చేనేత అనుభవంతో త్రీడీ ఎఫెక్ట్ ఉండేలా కొత్త డిజైన్తో చీరను రూపొందించారు. సాధారణంగా ఒక చీరకు 30 మెట్లు ఉంటే.. భాస్కర్ 1450 మెట్లతో నెమలి దేవత ఆకృతులతో గ్రాఫిక్ డిజైన్తో రూపొందించారు. నిలువు, 4అచ్చెలతో ప్యూర్ సిల్క్ చీరను 10 నెలల్లో తయారు చేశారు. ఈ చీర తయారీకి 7 రంగులను వాడినట్లు ఆయన పేర్కొన్నారు. తన భార్య విజయలక్ష్మి సహకారంతో కొత్త చీరను రూపొందించానని, దానికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని భాస్కర్ తెలిపారు. ఈ అవార్డుతో తమ చీరకు మార్కెటింగ్ ఏర్పడి తమ జీవనపాధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
పోచంపల్లి డబుల్ ఇక్కత్ చీర..
చిట్యాల: చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు చిట్టిప్రోలు ధనుంజయ్య మగ్గంపై నేసిన పోచంపల్లి డబుల్ ఇక్కత్ తరహాలోని చీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు దక్కింది. ఈ అవార్డుకు ఎంపిక చేసిన ప్రభుత్వానికి, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ధనుంజయ్యకు అవార్డు రావటం పట్ల చిట్యాల మండలానికి చెందిన పలువురు పద్మశాలీలు హర్షం వ్యక్తం చేశారు.
డిజైనింగ్లో ప్రతిభ
గట్టుప్పల్: చేనేత చీరల డిజైనింగ్లో ప్రతిభ కనబర్చిన గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన గాజులు అనిల్ కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు ఎంపికయ్యారు. ఆయన 2012 నుంచి పోచంపల్లి ఇక్కత్(జకార్డ్) చీరల బార్డర్లపై అన్ని రంగులతో డిజైన్లు వేస్తున్నారు. ఈ చీరలకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. అనిల్ ప్రతిభను గుర్తించిన రాష్ట్ర చేనేత, జౌళి శాఖ అధికారులు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అనిల్కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

మన చేనేత.. ఘనత

మన చేనేత.. ఘనత

మన చేనేత.. ఘనత

మన చేనేత.. ఘనత

మన చేనేత.. ఘనత