మోత్కూరు: సూర్యాపేట డిపో నుంచి శనివారం హైదరాబాద్కు బయల్దేరిన ఎలక్ట్రిక్ బస్సు మోత్కూరు పట్టణంలోని టీవీఎస్ షోరూం ఎదుట సాంకేతిక లోపంతో గంటన్నర సేపు నిలిచిపోయింది. డ్రైవర్ మరమ్మతుల కోసం ఎంతో శ్రమించినా ఫలితం లేకపోవడంతో డిపో మేనేజర్కు సమాచారం అందించారు. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉండగా.. బస్సు ఆగిపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. డ్రైవర్, కండక్టర్ డిపో టెక్నికల్ టీంతో వీడియో కాల్తో మాట్లాడగా.. బస్సులోని బ్యాటరీలు, శాటిలైట్ సిగ్నల్స్కు సంబంధించిన పరికరాలు హీట్ అవ్వడంతో బస్సు ఆగిపోయిందని తెలిపారు. ఇతర డిపోలకు చెందిన బస్సుల్లో కొంతమందిని ప్రయాణికులు తరలించారు. గంటన్నర తర్వాత బస్సు బయల్దేరడంతో మిగతా ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు వెళ్లారు.
‘కిట్స్’ చైర్మన్పై క్రిమినల్ కేసు నమోదు చేయండి
● జేఎన్టీయూ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి హైదరాబాద్లోని జేఎన్టీయూ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు. కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు సమయంలో కాకతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్గా ఉన్న నీలా సత్యనారాయణ తప్పుడు, ఫోర్జరీ పత్రాలతో ఇతరుల భూమిని తనదిగా చూపి ఢిల్లీలోని ఏఐసీటీఈ, హైదరాబాద్లోని జేఎన్టీయూలను మోసగించినట్లు ఇటీవల విజిలెన్స్ అలర్ట్ నోటీస్ జారీ చేసింది. కళాశాల ఏర్పాటులో నీలా సత్యనారాయణ పది తప్పిదాలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి వాటిలో తొమ్మిది ఆరోపణలు నిజమని నిర్ధారించి నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించడంతో ఆ శాఖ కార్యదర్శి.. నీలా సత్యనారాయణతో పాటు తప్పుడు, ఫోర్జరీ పత్రాలను సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్లోని జేఎన్టీయూ రిజిస్ట్రార్ను ఆదేశించారు.
చెస్ ఎగ్జిబిషన్కు ఆహ్వానం
నల్లగొండ టూటౌన్: ప్రపంచ మాజీ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, ఆయన కుమారుడు అఖిల్ ఆనంద్తో కలిసి చైన్నెలో ఏర్పాటు చేసిన చెస్ ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి ఉమ్మడి జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కొసనం కరుణాకర్రెడ్డికి ఆహ్వానం అందింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు నిర్వహించే చెస్, కలలు, మ్యాథ్స్ ఎగ్జిబిషన్(మార్పి గెనిసిస్)లో పాల్గొనడానికి కరుణాకర్రెడ్డి శనివారం చైన్నె బయల్దేరి వెళ్లారు.
సాంకేతిక లోపంతో ఆగిపోయిన ఎలక్ట్రిక్ బస్సు