
ఆటోను ఢీకొట్టిన లారీ.. పలువురికి గాయాలు
చౌటుప్పల్: హైదరాబాద్–విజయవాడ హైవేపై చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం రాత్రి ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటోలోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అడవిదేవులపల్లి మండలం మొల్కచెర్ల గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆంజనేయులు, భార్గవి, వెంకటయ్య, అంజి, శ్రీకాంత్, రేణుక, మొగులమ్మ, త్రివేణితో పాటు వారి పిల్లలు మొత్తం 14మంది కలిసి శనివారం సాయంత్రం ఆటోలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడ గ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో రాత్రి 9గంటల సమయంలో చౌటుప్పల్ పట్టణంలోని పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వెనుక నుంచి అతివేగంగా లారీ వచ్చి ఆటోను ఢీకొని ముందుకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వారందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటో ముందు సీట్లో తండ్రితో కలిసి కూర్చున్న దీక్షిత(5)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె తల వెనుక భాగం పగిలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
పెన్పహాడ్: తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్పహాడ్ మండలం మేగ్యాతండా ఆవాసం కేవ్లాతండాకు చెందిన లకావత్ లఘుపతి ఇంటికి గత నెల 28న తాళం వేసి ఉండగా.. చివ్వెంల మండలం తుల్జారావుపేటకు చెందిన ధరావత్ మణిరామ్ గడ్డపారతో తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి తులం బంగారం, రూ.5వేల నగదు అపహరించాడు. బాధితుడు లఘుపతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోపికృష్ణ కేసు నమోదు చేయగా.. దర్యాప్తులో భాగంగా క్లూస్టీం సహాయంతో చోరీకి పాల్పడిన మణిరామ్ను పట్టుకొని అతడి వద్ద నుంచి సొత్తుని రికవరీ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ఆటోను ఢీకొట్టిన లారీ.. పలువురికి గాయాలు