చండూరు: అప్పుల బాధతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చండూరు మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగింది. మంగళవారం ఎస్ఐ నర్సింగ్ వెంకన్నగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు మండల కేంద్రంలోని సర్దార్ కాలనీకి చెందిన అన్నపురెడ్డి మహేష్(30) మద్యానికి బానిసై స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మహేష్ తండ్రి నరసింహ గమనించి అతడిని మొదట నల్ల గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మంగళవారం మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
కుక్కను ఢీకొట్టిన బైక్.. మహిళ మృతి
● ఆమె కుమారుడికి గాయాలు
భువనగిరిటౌన్ : తల్లి, కుమారుడు బైక్పై వెళ్తుండగా కుక్కను ఢీకొట్టి అదుపుతప్పి కిందపడడంతో తల్లి మృతిచెందింది. కుమారుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన భువనగిరి పట్టణ శివారులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం రామోజీపేటకు చెందిన తునిక లక్ష్మి(41) భువనగిరి బస్టాండ్లో పూల దుకాణం నిర్వహిస్తోంది. మంగళవారం దుకాణం తీసేందుకు గాను ఆమె తన కుమారుడు క్రాంతితో కలిసి బైక్పై భువనగిరికి వస్తున్నారు.
భువనగిరిలోని లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాల వద్దకు రాగానే రోడ్డుపై అడ్డంగా వచ్చిన కుక్కను ఢీకొట్టి అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో తునిక లక్ష్మి డివైడర్పై పడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె కుమారుడు క్రాంతికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రాంతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు భువనగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అప్పుల బాధతో యువకుడి బలవన్మరణం