
క్షేత్రపాలకుడికి క్షీరాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరంతో పాటు పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చన జరిపించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేధ్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవలు వంటి పూజలు కొనసాగాయి.
‘మత్స్యగిరి’
హుండీలు లెక్కింపు
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీలు లెక్కించారు. వివిధ హుండీల ద్వారా 90 రోజులకు గాను రూ.12,85,884 ఆదాయం సమకూరిందని ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహనబాబు తెలిపారు. అలాగే ఇటీవల గ్రామ శివారులో నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణ కట్ట హుండీలో రూ.24,644 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకులు వెంకటలక్ష్మి, ధర్మకర్తలు, వేదపండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
పాలిసెట్
కౌన్సిలింగ్ ప్రారంభం
రామగిరి(నల్లగొండ) : పాలిసెట్ – 2025 కౌన్సిలింగ్ మంగళవారం ప్రారంభమైందని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.నరసింహ అన్నారు. నల్ల గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని.. కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు జూన్ 26 నుంచి జూలై 1వ తేదీ వరకు కాలేజీ ఎంపికకు ఆన్లైన్లో ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు.

క్షేత్రపాలకుడికి క్షీరాభిషేకం