
రైతు భరోసాలో కోత!
సాక్షి, యాదాద్రి : రైతు భరోసా డబ్బులు రైతులందరికీ పూర్తిస్థాయిలో అందలేదు. ఒక్క సీజన్కు సంబంధించి ప్రభుత్వం ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా ఇస్తోంది. జిల్లాలో పలువు రు రైతులకున్న భూములకు విస్తీర్ణానికి అనుగుణంగా వానాకాలం సీజన్ డబ్బులు జమ కాలేదు. ప్రధానంగా సాగు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా యాసంగి సీజన్కు ముందు జిల్లా వ్యాప్తంగా 22 వేల ఎకరాలను సాగు యోగ్యంకాని భూమిగా గుర్తించారు. ఒక సీజన్లో సాగుకు దూరంగా ఉన్న భూమికి కూడా భరోసా డబ్బులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా యాసంగిలో డబ్బులు జమ చేసింది. కానీ ఈ సారి మాత్రం కొందరికి అంతంత మాత్రంగానే రైతు భరోసా అందడంపై అయోమయానికి గురవుతున్నారు.
సాగు భూమికి మాత్రమే వర్తింపు
ప్రస్తుతం వానాకాలం సీజన్లో ఎకరాల చొప్పున కాకుండా సాగు భూమికి మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నాయి. గత యాసంగి సీజన్ తర్వాత వ్యవసాయ విస్తరణాధికారులు, శాటిలైట్ ద్వారా సాగు విస్తీర్ణంపై సర్వే చేశారు. దీంతో సాగుచేసిన భూమికి మాత్రమే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. దీంతో ఎకరాలతో నిమిత్తం లేకుండా తక్కువ మొత్తం డబ్బులు జమ కావడంతో గ్రామాల్లో రైతులు వ్యవసాయాధికారులను నిలదీస్తున్నారు. తమకున్న భూమికి కాకుండా తక్కువ డబ్బులు వచ్చాయని కొందరు.. తమకు మొత్తానికి మొత్తమే రాలేదని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరైతే తమకు పూర్తిస్థాయిలో రైతు భరోసా పడలేదని, మరికొందరు తమకు మొత్తంగా పడలేదని వెంటనే జమచేయాలని సోమవారం భువనగిరి కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు విన్నవించారు. కాగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం వరకు 2,27,544 మంది రైతులకు రూ.288.97 కోట్లు జమ అయ్యాయని అధికారులు చెబుతున్నారు.
రైతు భరోసా అందిందిలా..
మొత్తం రైతులు : 2,84,250
మంగళవారం వరకు
అందిన రైతులు : 2,27,544
జమ అయిన నగదు : రూ.288.97 కోట్లు
ఖాతాల్లో అరకొరగా డబ్బులు జమ
అయోమయంలో రైతులు
వ్యవసాయాధికారులకు
ఫిర్యాదుల వెల్లువ
పూర్తిస్థాయిలో అందించాలని
కలెక్టర్కు విన్నపాలు
తక్కువ డబ్బులు పడ్డాయి
మా గ్రామంలో 5 ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమయ్యాయి. నాకు 1.3 ఎకరాల భూమి ఉంది. పట్టా పాసు పుస్తకం కూడా ఉంది. భూమి కూడా సాగులోనే ఉన్నా తక్కువ డబ్బులు వచ్చాయి.
– జెట్ట శ్రీనివాస్, సర్వేపల్లి,
ఆత్మకూర్(ఎం) మండలం

రైతు భరోసాలో కోత!