
ఖిలా పనులు ప్రారంభమెప్పుడు?
భువనగిరి : భువనగిరి ఖిలా అభివృద్ధి పనుల ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. రోప్ వే నిర్మాణం కోసం 2013లో 2.30 ఎకరాలు సేకరించిన అధికారులు మరో 1.10 ఎకరాల భూమి కోసం రైతులతో పలుమార్లు చర్చలు జరిపారు. అయితే రైతులు కూడా సానుకూలంగా స్పందించి భూమి ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయి పనుల కోసం టెండర్లు ఆహ్వానించారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి సుమారు మూడు నెలలు కావొస్తుంది. రోప్ వే, లిప్టు, రాజ్మహల్ వద్ద ఏర్పాటు చేయనున్న వాటర్ పౌంటెయిన్ నమూనా చిత్రాలను అధికారులు గత అక్టోబర్లోనే విడుదల చేసినా పనులు మాత్రం ప్రారంభించలేదు.
అభివృద్ధి పనులకు రూ.118 కోట్లు
స్వదేశీ దర్శన్ – 2.0 పథకంలో భాగంగా భువనగిరి ఖిలాను పర్యాటక కేంద్రగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం రూ.118 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మొదటి విడతలో రూ.60 కోట్లు, మలి విడతలో రూ.58 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఈ పనులకు గత ఏడాది ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు, ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ప్రతినిధులు పలుమార్లు ఖిలాను సందర్శించి పనులకు సంబంధించి ప్రదేశాలను పరిశీలించారు.
టెండర్ల ప్రక్రియ పూర్తయినా..
అభివృద్ధి పనుల్లో ప్రధానంగా మౌలిక వసుతుల కల్పన, లైటింగ్, పార్కులు, కన్వెన్షన్ హాళ్లు, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు ఖిలాపైకి ఒకేసారి 250 మంది ఎక్కేందుకు రోప్ వే ఏర్పాటు చేయడంతోపాటు కోటపైకి వెళ్లేందుకు మూడు దశల్లో లిఫ్టు పనులు చేపపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేశారు. ఈ అభివృద్ధి పనులు జరిగితే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు భావించారు. కానీ పనులకు సంబంధించిన టెండర్లు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభించడం లేదు.
పూర్తయిన టెండర్ల ప్రక్రియ
భూ సేకరణకు రైతులు సానుకూలం
ఇప్పటికే ప్రభుత్వానికి అందిన నివేదిక
ఇంకా మొదలుపెట్టని పనులు
త్వరలోనే పనులు ప్రారంభించే అవకాశం
భువనగిరి ఖిలాపై అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే పనులకు సంబంధించి వర్క్ ఆర్డర్ జారీ చేసే అవకాశం ఉంది. పనులు పూర్తయితే భువనగిరి ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
– మందడి ఉపేందర్రెడ్డి,
రాష్ట్ర పర్యాటశాఖ జనరల్ మేనజర్

ఖిలా పనులు ప్రారంభమెప్పుడు?