
వన మహోత్సవాన్ని విజయవంతం చేస్తాం
సాక్షి, యాదాద్రి : ప్రజలను భాగస్వామ్యంతో వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం చేస్తామని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్కు భువనగిరి కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు కలిసి హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం మొదలైనందున వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. పలు అంశాలపై చర్చించి అధికారులకు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ హనుమంతరావు