ఊరు నిర్మించిన పాఠశాల | - | Sakshi
Sakshi News home page

ఊరు నిర్మించిన పాఠశాల

Jun 25 2025 1:12 AM | Updated on Jun 25 2025 1:12 AM

ఊరు న

ఊరు నిర్మించిన పాఠశాల

చిట్యాల: 36 ఏళ్ల క్రితం ఆ ఊరి ప్రజలంతా కలిసి కొంత నగదును పోగేసి స్వయంగా శ్రమదానం చేసి పాఠశాలను నిర్మించుకున్నారు. అలా ఊరందరి పాఠశాలగా నిలిచిపోయిన ఆ స్కూల్‌ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌.

1989లో పాఠశాల నిర్మాణానికి బీజం..

1989లో వట్టిమర్తి గ్రామానికి చెందిన నర్రా రాఘవరెడ్డి నకిరేకల్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అప్పట్లో ఆ గ్రామం నల్లగొండ శాసనసభ పరిధిలో ఉండేది. గ్రామానికి చెందిన కొందరు అప్పటి సర్పంచ్‌ రాచమల్ల రామచంద్రం ఆధ్వర్యంలో వట్టిమర్తి గ్రామాభివృద్ధికి సహకరించాలని నకిరేకల్‌ ఎమ్మెల్యేగా ఉన్న నర్రా రాఘవరెడ్డిని కోరారు. దీంతో తమ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని ఆయన తలంచారు. గ్రామస్తులంతా కలసి స్థలం సమకూరిస్తే ప్రభుత్వ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి తీసుకొస్తానని రాఘవరెడ్డి హామీనిచ్చారు. అదే సమయంలో నేరడ గ్రామానికి చెందిన సీపీఎం నాయకుడు చెరుపల్లి సీతారాములు జెడ్పీ వైస్‌ చైర్మన్‌గా పనిచేస్తుడంటంతో పాఠశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గ్రామస్తులంతా తమకు తోచినంత నగదు పోగేసి గ్రామంలో నాలుగున్నర ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు.

ఊరందరి శ్రమదానంతో..

పాఠశాల నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలంలో గ్రామస్తులంతా శ్రమదానం చేసి పాఠశాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. అలా నిర్మాణం చేసుకున్న పాఠశాలలో తరగతుల నిర్వహణకు నర్రా రాఘవరెడ్డి అనుమతి తీసుకువచ్చారు. పాఠశాల నిర్వహణ కోసం పాఠశాల ఆవరణలోనే పండ్ల తోటలు సాగుచేసి ప్రతియేటా ఆదాయాన్ని పొందేట్లుగా తీర్చిదిద్దారు. అయితే 2013లో విద్యార్థులు తగ్గిపోయి ఈ పాఠశాల మూసివేసే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామానికి చెందిన ఆదర్శ యువజన సంఘం సభ్యులు మరోసారి నర్రా రాఘవరెడ్డిని కలిసి సమస్యను వివరించడంతో ఆయన ఆయన గ్రామస్తులందరితో సమావేశం నిర్వహించి గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని తీర్మానం చేయించారు. దీంతో ఈ పాఠశాల ఎందరినో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. ప్రస్తుతం ఈ జెడ్పీహెచ్‌ఎస్‌లో 80మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఎందరినో ఉద్యోగులను తీర్చిదిద్ది..

ఈ పాఠశాలలో చదివిన ఎందరో విద్యార్థులు నేడు ప్రభుత్వ ఉద్యోగులుగా, మరెందరో ప్రైవేటు రంగంలో ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ఈ గ్రామంలో 520 కుటుంబాలుండగా 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరిలో డాక్టర్లు, ఎస్‌ఐలు, తహసీల్దార్లు, జడ్జిలు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, విద్యుత్‌, ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు.

గ్రామస్తుల విరాళాలతో ఏర్పాటైన

వట్టిమర్తి జెడ్పీహెచ్‌ఎస్‌

శ్రమదానం చేసి నిర్మాణంలో

పాలుపంచుకున్న ఊరి ప్రజలు

36 ఏళ్లుగా ఎందరినో ఉన్నత

విద్యావంతులుగా తీర్చిదిద్దిన పాఠశాల

ఊరు నిర్మించిన పాఠశాల1
1/1

ఊరు నిర్మించిన పాఠశాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement