
భళా.. పోచంపల్లి ఇక్కత్ కళ
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ ఎంతో కళాత్మకంగా ఉందని వివిధ దేశాలకు చెందిన జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారుల బృందం కొనియాడారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో అంతర్జాతీయ శిక్షణ పొందుతున్న నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, తజకిస్తాన్, ఇథియోపియా, కెన్యా, సౌత్ సూడాన్, సెషెల్లస్, మొజాంబిక్, ఉగాండా, ట్యునీషియా, సిర్రా ల్యునే, లెసొతో, ట్రినిడాడ్ అండ్ టొబాగో, చిలీ దేశాలకు చెందిన 50 మంది జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారులు, జర్నలిస్టులు భూదాన్పోచంపల్లిని మంగళవారం సందర్శించారు. టూరిజం పార్కు, చేనేత గృహాలు, మాస్టల్వీవర్స్ హ్యాండ్లూమ్ యూనిట్, చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. నూలు వడకడం, చిటికి కట్టడం, రంగులద్దకం, మగ్గాలపై వస్త్రాలను తయారు చేసే విధానాలను ప్రత్యక్షంగా తిలకించారు. సహకార సంఘంలో చేనేత వస్త్రాల నాణ్యత, డిజైన్లను పరిశీలించి చేనేత కళాకారుల నైపుణ్యాలను అభినందించారు. పోచంపల్లి ఇక్కత్కు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపును తెలుసుకొని అబ్బురపడ్డారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ది సంస్థ నోడల్ అధికారి సురేశ్కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 28 వరకు ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వ ఆర్గనైజేషన్లలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులకు కోర్సు డైరెక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో ఇండియన్ టెక్నికల్ అకడమిక్ కోఆపరేషన్ సౌజన్యంతో అంతర్జాతీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని చెప్పారు. అందులో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన నిమిత్తం వారు పోచంపల్లికి వచ్చారని తెలిపారు. వీరికి చేనేత జౌళి శాఖ డీఓ రాజేశ్వర్రెడ్డి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, చేనేత సహకార సంఘం మేనేజర్ రుద్ర అంజనేయులు, కార్మిక సంఘం నాయకులు బొమ్మ హరిశంకర్, భారత భూషణ్, పొట్టబత్తిని వేణు మార్గదర్శకం చేశారు.
పోచంపల్లిని సందర్శించిన వివిధ
దేశాలకు చెందిన జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారుల బృందం