
వినతులు.. వేడుకోలు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్ కార్యాలయం సోమవారం జనంతో కిక్కిరిసింది. తమ సమస్యలు విన్నవించుకోవడానికి జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చారు. సామూహికంగా, వ్యక్తిగతంగా అర్జీలు అందజేయడంతో పాటు తమ బాధలను నేరుగా అధికారులకు విన్నవించారు. భూమి కబ్జా చేశారని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, పింఛన్ వస్తలేదని, సదరం క్యాంపులో అర్హులకు సర్టిఫికెట్లు అందడం లేదని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్య ఏకరువుపెట్టారు.
● ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. పాఠశాలల్లో కనీస వసతులు లేకపోయినా వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
● రైతుభరోసా రాలేదని భువనగిరి మండలంలోని గౌస్నగర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు మాజీ సర్పంచ్ ఈర్ల కృష్ణ అధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు.కలెక్టర్కు వినతిపత్రం అందజేసి తమ సమస్య పరిష్కరించాలని వేడుకున్నారు.
● భువనగిరిలోని ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంపులో నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని ఆరోపిస్తూ వికలాంగుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. వికలత్వం ఎక్కువ ఉన్నవారికి తక్కువ శాతం వేసి సర్టిఫికెట్లు ఇస్తున్నారని, దీంతో అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు.
అర్జీల వెల్లువ
ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లాల నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి వినతులు అందజేశారు. వివిధ సమస్యలపై వంద వరకు అర్జీలు వచ్చాయి. అందులో అత్యధికంగా భూ సమస్యలకు సంబంధించి 54,జిల్లా గ్రామీణాభివృద్ధి 6, పంచాయతీ రాజ్ 5, సర్వే లాండ్స్ 4, జిల్లా పరిషత్ 4, మున్సిపాలిటీ 2, జిల్లా వైద్యారోగ్య 2, విద్యుత్, అటవీ, రోడ్లు, భవనాలు, ఎంప్లాయిమెంట్, సంక్షేమ శాఖలకు సంబంధించి ఒక్కొకటి చొప్పున అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి తదితర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ హనుమంతరావు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు.
భూమి కబ్జా చేశారు
ఇక్కడ కనిపిస్తున్న రైతులది సంస్థాన్నారాయణపురం మండలం అల్లాపురం గ్రామం. గ్రామంలోని సర్వే నంబర్ 85లో గల పది ఎకరాల ప్రభుత్వ భూమిలో గత కొన్నేళ్లుగా నివాసం ఏర్పరుచుకొని ఉంటున్నారు. కొందరు వ్యక్తులు పక్క భూముల రైతుల సహకారంతో భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, గుడిసెలు తొలగించి తమను వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ భూమి రాచకొండ రెవెన్యూ పరిధిలో ఉందని, దీనిపై గతంలో తహసీల్దార్కు అర్జీ పెట్టినా స్పందించలేదన్నారు. నిరుపేదలమైన తమకు న్యాయం చేయాలని కోరారు.
ఫ ప్రజావాణికి తరలివచ్చిన జనం
ఫ వివిధ సమస్యలపై సుమారు వంద అర్జీలు
ఫ వినతులు స్వీకరించి, పరిష్కారానికి భరోసా ఇచ్చిన కలెక్టర్

వినతులు.. వేడుకోలు