
షెడ్లలోనే చెత్త ట్రాక్టర్లు!
ఆత్మకూర్(ఎం), యాదగిరిగుట్ట రూరల్: పల్లెల్లో చెత్త సేకరణ నత్తనడకన సాగుతోంది. నిరంతరం కొనసాగాల్సిన ఈ ప్రక్రియ.. వారంలో ఒకటి, రెండు దఫాలే జరుగుతోంది. ట్రాక్టర్లలో డీజిల్ లేకపోవడమే ఇందుకు కారణం. సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వాలనుంచి నిధులు నిలిచి పంచాయతీల నిర్వహణ కష్టంగా మారింది. మొన్నటి వరకు అప్పు చేసి పనులు చేపట్టిన పంచాయతీ కార్యదర్శులు.. ఆర్థికభారం భరించలేక ట్రాక్టర్ల నిర్వహణ చూడలేమంటూ మండల పరిషత్ కార్యాలయాల్లో తాళం చేతులు అప్పగించారు. నాటినుంచి డీజిల్ లేక ట్రాక్టర్లు షెడ్లకే పరిమితం అయ్యాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో మాత్రం వారంలో ఒకటి, రెండుసార్లు కార్యదర్శులు సొంత ఖర్చులతో ట్రాక్టర్లకు డీజిల్ పోయించి చెత్త సేకరిస్తున్నారు.
నిధులు నిల్
పల్లెల్లో చెత్త సేకరణ, మొక్కలకు నీరు పోస్తేందుకు గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున ట్రాక్టర్, ట్యాంకర్ మంజూరు చేసింది. అందులో భాగంగా యాదాద్రి జిల్లాలోని 421 పంచాయతీలు ప్రభుత్వ నిధులతో ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. మేజర్ పంచాయతీల్లో ప్రతి రోజూ, చిన్న గ్రామ పంచాయతీల్లో రెండు రోజులకు ఒకసారి తప్పనిసరిగా చెత్త సేకరించాల్సి ఉంటుంది. పెద్ద పంచాయతీలో డీజిల్ ఖర్చు నెలకు రూ.10వేలు వరకు, చిన్న గ్రామ పంచాయతీలో రూ.5 వేలు చొప్పున ఖర్చు వస్తుంది. అయితే పంచాయతీల్లో ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగియడంతో 15 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది.
భారమంతా కార్యదర్శులపైనే..
నాటినుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం, ప్రత్యేకాధికారులు అటువైపు కూడా చూడకపోవడంతో పంచాయతీల నిర్వహణ కార్యదర్శులు చూడాల్సి వస్తుంది. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు ఇంతకాలం సొంతఖర్చులతో సమస్యలు పరిష్కరిస్తూ వచ్చారు. ముఖ్యంగా ట్రాక్టర్ల నిర్వహణ భారం తడిసిమోపడయ్యేది. కానీ, ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడం, ఆర్థిక భారం భరించలేక పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ పిలుపుమేరుకు ట్రాకర్ల నిర్వహణ చూడలేమంటూ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయాల్లో తాళం చేతులు అప్పగించారు.
ఇంధనం లేక కదలని బండ్లు
ఫ ఇంటింటి చెత్త సేకరణకు ఆటంకం
ఫ మేజర్ పంచాయతీల్లోనే వారంలో
ఒకటి, రెండు దఫాలు సేకరణ
ఫ చిన్న పంచాయతీల్లో పూర్తిగా బంద్
ఫ పది రోజులుగా పల్లెల్లో దుర్గంధం