
పక్కా భవనాలు, ప్రహరీలకు నిధులు
ఉపాధిహామీ పథకం కింద రూ.8.47 కోట్లు మంజూరు
రామన్నపేట: 2025–26 ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఉపాధిహామీ పథకం కింద జిల్లాకు రూ.8.47 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో 63 శాశ్వత నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ నిధులతో ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలకు పక్కా భవనాలు, పాఠశాలలకు ప్రహరీలు నిర్మించనున్నారు.
పంచాయతీ భవనాలకు రూ.2కోట్లు..
జిల్లాలోని పది గ్రామ పంచాయతీలకు శాశ్వత భవన నిర్మాణాల కోసం రూ.2కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఆలేరు మండలంలోని కందిగడ్డతండా, బొమ్మలరామారం మండలం కాజీపేట, గుండాల మండలం మాసాన్పల్లి, రాజాపేట మండలం కుర్రారం, తుర్కపల్లి మండలం గుజ్జవానికుంటతండా, యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు, సంస్థాన్నారాయణపురం మండలం డాకుతండా, రామన్నపేట మండలం ఇస్కిళ్ల, అడ్డగూడూరు పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున కేటాయించారు.
అంగన్వాడీ సిబ్బందికి తీరనున్న సమస్యలు
26 అంగన్వాడీ భవన నిర్మాణాలకు రూ 3.12కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో భవన నిర్మాణానికి రూ.12లక్షలు కేటాయించారు. ఆలేరు నియోజకవర్గంలోని తూర్పుగూడెం, పటేల్గూడెం, రాయిపల్లి, ఉప్పలపహాడ్, బొమ్మలరామారం(2), నూనెగూడెం, అనంతగూడెం, అమ్మనబోలు, మాటూరు, మొల్లగూడెం, చల్లూరు, ముల్కలపల్లి, ధర్మారం, సాదువెల్లి, చిన్నకందుకూరు, మునుగోడు నియోజకవర్గంలో దండుమల్కాపురం, జైకేసారం, సంస్థాన్ నారాయణపురం, జనగాం, నకిరేకల్ నియోజకవర్గంలో ఎన్నారం, సిరిపురం, తుంగతుర్తి నియోజకవర్గంలో అజీంపేట, గోవిందాపూర్, దత్తప్పగూడెం, పాలడుగు గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు నిర్మించనున్నారు. ప్రస్తుతం వీటిని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడం, పైగా ఇరుకుగదులు కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవనాలు అందుబాటులోకి వస్తే అంగన్వాడీ సిబ్బందికి సమస్యలు తీరనున్నాయి.
ప్రహరీలతో పాఠశాలలకు రక్షణ
పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో రక్షణ లేకుండాపోయింది. పశవులు, ఇతర మూగజీవాలు వస్తున్నాయి. రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఉపాధిహామీ పథకం కింద 27 పాఠశాలలకు రూ 3.35 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఒక యూపీఎస్, 14 ఉన్నత, 12 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
మిగతా కేంద్రాలకూ నిధులివ్వాలి
సిరిపురంలో నాలుగు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. నాలుగు కేంద్రాలకు సొంత భవనాలు లేవు. భవనాల నిర్మాణాలకు అవసరమైన స్థలాన్ని దాతలు గ్రామ పంచాయతీకి అప్పగించారు. ఒక అంగన్వాడీ కేంద్రానికి నిధులు మంజూరయ్యాయి. మిగతా మూడు కేంద్రాలకు కూడా దశలవారీగా నిధులు మంజూరు చేయాలి. –అప్పం లక్ష్మీనర్సు,
తాజామాజీ సర్పంచ్, సిరిపురం
ఫ పంచాయతీ కార్యాలయాలు,
అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు
ఫ 27 పాఠశాలలకు ప్రహరీల నిర్మాణం
ఇది రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మారెపల్లి మల్లారెడ్డి అనే దాత ఇచ్చిన స్థలంలో ఆర్ఎంఎస్ఏ నిధులు వెచ్చించి 2012 సంవత్సరంలో పాఠశాల ఏర్పాటు చేశారు. కానీ, ప్రహరీ నిర్మించలేదు. చుట్టూ పెరిగిన కంపచెట్లే పాఠశాలకు కంచెగా మారాయి. ప్రహరీ నిర్మాణానికి ఉపాధిహామీ నిధులు రూ.20 లక్షలు మంజూరు కావడంతో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పక్కా భవనాలు, ప్రహరీలకు నిధులు