
గుర్తుతెలియని యాచకుడి మృతదేహం లభ్యం
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట–మల్లాపురం రహదారిలో సోమవారం గుర్తుతెలియని యాచకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పరిధిలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సుమారు 65 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి సోమవారం యాదగిరిగ్టుట–మల్లాపురం రహదారిలో ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద ఆవుల కృష్ణకు చెందిన పశువుల కొట్టం విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాముకాటుకు గురై
మహిళ మృతి
వలిగొండ: పాముకాటుకు గురై మహిళ మృతి చెందింది. ఈ ఘటన వలిగొండ మండలం గుర్నాథపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్నాథపల్లి గ్రామానికి చెందిన తోట జయమ్మ(65) ఆదివారం రాత్రి ఆరుబయట నిద్రించగా.. రాత్రి 10గంటల సమయంలో ఆమెను పాము కాటేసింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు.
అన్నివర్గాల మద్దతుతోనే ఎస్సీ వర్గీకరణ
● ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
గోవిందు నరేష్ మాదిగ
చిట్యాల: అన్ని వర్గాలు, రాజకీయ పార్టీల మద్దతుతోనే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ అన్నారు. చిట్యాలలో సోమవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంద కృష్ణమాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాలుగా చేసిన రాజీలేని పోరాటంతో చివరికి విజయం దక్కిందన్నారు. ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ఏర్పాటైన ఎమ్మార్పీఎస్ అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. ఫలితంగానే మంద కృష్ణమాదిగను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించిందని అన్నారు. ఈ సమావేశంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గాదే రమేష్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు మేడి శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి ఎరసాని గోపాల్, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు నోముల పురుషోత్తం, జీడిమెట్ల రవీందర్, కావలి కృష్ణ, జోగు ప్రవీణ్, మేడి లింగస్వామి, మేడి నర్సింహ, జనగాం అర్జున్, రుద్రవరం లింగస్వామి, మేడి ధనుంజయ పాల్గొన్నారు.