
కోతుల దాడి.. వృద్ధుడికి తీవ్ర గాయాలు
మోత్కూరు : కోతుల దాడిలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన కొంపెల్లి భిక్షమయ్య(75) తన ఇంటి ఆవరణలో పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా కోతుల గుంపు వచ్చి అతడిపై దాడికి పాల్పడ్డాయి. అతడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. భిక్షమయ్య కుటుంబ సభ్యులు గమనించి కోతులను తరిమేసి అతడిని మోత్కూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా గ్రామంలో కోతుల సంచారం పెరగడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, కోతుల బెడద నుంచి రక్షించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.