
క్రీడా స్కూళ్లలో ప్రవేశానికి 16 నుంచి ఎంపిక పోటీలు
భువనగిరి : తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మండలాలకు చెందిన ఎంఈఓలు నిర్ణయించిన తేదీల ప్రకారం పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. మండల స్థాయిలో ఎంపికై న బాలబాలికలకు ఈ నెల 25న ఉదయం 8గంటలకు భువనగిరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణంలో జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పోటీలకు హాజరు కానున్న విద్యార్థులు 2016 నవంబర్ 1 నుంచి 2017 ఆగస్టు 31 మధ్యలో జన్మించి ఉండాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీలకు వచ్చేవారు జనన ధ్రువీకరణ పత్రం, 3వ తరగతికి సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు సెల్ నంబర్ 8309992451ను సంప్రదించాలని కోరారు.
హనుమంతుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. హనుమంతుడికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేధ్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడుసేవలు వంటి పూజలు కొనసాగాయి.
సీజనల్ వ్యాధులతో
అప్రమత్తంగా ఉండాలి
భువనగిరి : సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. మంగళవారం భువనగిరి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఆశ నోడల్ ఆఫీసర్స్, ఫెసిలిటేటర్స్తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయిలో వివిధ శాఖల సమన్వయంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో రాఫిడ్ రెస్పాన్స్ టీమ్స్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవ సేవలను అందించాలని, అబార్షన్ రేటును తగ్గించి వ్యాధి నిరోధక టీకాలను 100 శాతం వేయాలన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ శిల్పిని, యశోద, డాక్టర్ రామకృష్ణ, వీణా, ఆశ నోడల్ అధికారులు సత్యవతి, హెల్త్ ఎడ్యుకేటర్ వసంత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిలో బాంబ్స్క్వాడ్ బృందం తనిఖీలు
భువనగిరిటౌన్ : ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ కంగార్ జరుగుతున్న నేపథ్యంలో భువనగిరిలో మంగళవారం పోలీసులు ముమ్మర తనిఖీ చేపడుతున్నారు. భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాంటీబాంబ్ స్క్వాడ్ సిబ్బంది డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. అలాగే రహదారి బంగ్లాలో తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలోలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారంలో రోజుల నుంచి భువనగిరి పట్టణంలో అనుమానం వచ్చిన ప్రతి చోట తనిఖీలు చేపడుతున్నారు.

క్రీడా స్కూళ్లలో ప్రవేశానికి 16 నుంచి ఎంపిక పోటీలు