
గవర్నర్ రాకకు అంతా సిద్ధం
భూదాన్పోచంపల్లి: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ దంపతులు గురువారం భూదాన్పోచంపల్లిని సందర్శించనున్నారు. ఉదయం రాజ్భవన్ నుంచి బయలుదేరి 10.30 గంటలకు పోచంపల్లికి చేరుకోనున్నారు. చేనేత కార్మికుల యోగక్షేమాలు, వృత్తి, సాదకబాధకాలు స్వయంగా తెలుసుకునేందుకు గవర్నర్ వారి గృహాలను సందర్శించనున్నారు. అనంతరం టూరిజం పార్కులోని మ్యూజియానికి వెళ్లి కొకూన్స్లో నుంచి వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. ఆ తరువాత ఎంపిక చేసిన 25 మంది చేనేత కార్మికులతో టూరిజం పార్కులోనే ముఖాముఖి సమావేశం కానున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ హనుమంతరావు.. చేనేత జౌళిశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, ఏడీ శ్రీనివాస్రావు, డీసీపీ అక్షాంశ్యాదవ్, ఏసీపీ మధుసూధన్రెడ్డి తదితర అధికారులతో కలిసి బుధవారం టూరిజం పార్కు, చేనేత కార్మికుల గృహాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్ దంపతులు సందర్శించనున్న చేనేత గృహాల గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించాలని, సంప్రదాయకంగా బొట్టు పెట్టి స్వాగతం పలకాలని చేనేత కార్మికులకు సూచించారు. గవర్నర్ కు ఇంగ్లిష్లో అనువాదం చేయటానికి గైడ్ను ఏర్పాటు చేయాలని అధికారుకు సూచించారు.
గవర్నర్ పర్యటన షెడ్యూల్
● గవర్నర్ గురువారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్లోని రాజ్భవన్ నుంచి బయలు దేరి 10.30 గంటలకు పోచంపల్లికి చేరుకుంటారు.
● 10.30 నుంచి 11 గంటల వరకు టూరిజం పార్కు సమీపంలోని పెండెం కృష్ణ, భారత భాస్కర్, భారత మధు చేనేత కార్మికుల గృహాలను సందర్శిస్తారు.
● 11 నుంచి 11.15 వరకు టూరిజం పార్కులో చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలు పరిశీలిస్తారు.
● 11.15 నుంచి 11.45 వరకు చేనేతకార్మికులతో ముఖాముఖి మాట్లాడుతారు.
● 11.45 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు చేనేత కార్మికులకు నేతన్న బీమా, త్రిఫ్ట్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తారు.
నేడు పోచంపల్లిలో పర్యటించనున్న జిష్ణుదేవ్ వర్మ
ఫ వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలించనున్న గవర్నర్
ఫ చేనేత కార్మికులతో ముఖాముఖి